Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Remal: దూసుకొస్తోన్న రెమాల్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉందంటే

తీవ్ర తుఫాన్‌గా బలపడిన రెమాల్ బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటబోతోంది. తుఫాన్‌ ప్రభావంతో గంటకు 120-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున NDRF సిబ్బంది రంగంలోకి దిగింది. ఇక.. రెమాల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఏడుగురు మృతిచెందడంతో నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.

Cyclone Remal: దూసుకొస్తోన్న రెమాల్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉందంటే
Cyclone Remal
Follow us
Ram Naramaneni

|

Updated on: May 26, 2024 | 8:34 PM

బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. ఇప్పటికే.. తీవ్ర తుఫాన్‌గా మారిన రెమాల్.. పశ్చిమబెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక.. రెమాల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో.. నాగర్‌కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుక రాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని చనిపోయారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. ధారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దఅంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడలో వర్షం కురిసింది. కీసర, ఘట్‌కేసర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి. ఇక.. షామీర్‌పేటలో గాలి దుమారానికి చెట్టు విరిగి పడడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షం, చెట్లు విరిగిపడడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

అటు.. రెమాల్‌ తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ.. పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో.. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్డుల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. ఇక.. తీవ్ర తూఫాన్‌ ఎఫెక్ట్‌తో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాహనదారులను కెరటాలు ముంచెత్తుతుండడంతో బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. అటు.. రెమాల్ తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉధృతి, ఈదురు గాలులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..