రుణమాఫీపై మొదలైన రణం.. హరీష్‌రావు రాకతో యాదాద్రిని శుద్ది చేసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలామంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాలేదని.. అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది.

రుణమాఫీపై మొదలైన రణం.. హరీష్‌రావు రాకతో యాదాద్రిని శుద్ది చేసిన కాంగ్రెస్ నేతలు
Cm Revanth Reddy, Harish Rao
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 23, 2024 | 1:31 PM

తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలామంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాలేదని.. అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. తాజాగా యాదాద్రి ఆలయ కేంద్రంగా రుణమాఫీ పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత మధ్య రుణమాఫీ వివాదం ముదురుతోంది. రుణమాఫీ వివాదంలోకి దేవుళ్ళను లాగుతున్నారా..? అంటే హరీష్ రావు టెంపుల్ టూర్ అందుకే అంటోంది కాంగ్రెస్.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు..

రాష్ట్ర రాజకీయాలన్నీ రుణమాఫీ కేంద్రంగానే సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రుణమాఫీ అయిందని కాంగ్రెస్, కాలేదని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. 49వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని, డిసెంబర్ నెలలో చెప్పిన రేవంత్ సర్కార్.. కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో 40వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరి ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు.. కేబినెట్‌లో నిర్ణయించిన 31వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో 26వేల కోట్లకు కుదించారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఆగస్టు15 నాడు రుణమాఫీ పూర్తయిందని, 17వేల కోట్లను మాఫీ చేశామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై బిఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

బీఆర్ఎస్ పాప పరిహార సంకల్ప ప్రమాణం…

తాజాగా యాదాద్రి ఆలయ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రుణమాఫీ వివాదం ముదురుతోంది. రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని మండిపడుతున్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారని, ప్రజలకు ఆ పాపం చుట్టుకోకుండా మాజీ మంత్రి హరీష్‌రావు ఆలయాల యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి ఆలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుచరులతో కలిసి హరీష్ రావు వచ్చారు. ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధుల్లో ఓ పూజారితో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేశారు. తర్వాత ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.

రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశామని చెప్పారు. “స్వామీ… ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు” అని వేడుకున్నాని అన్నారు. సీఎం రేవంత్ రైతులను మోసం చేయడమే కాదు.. దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డాడని హరీష్ మండిపడ్డారు. పాప పరిహారం కోసం ఆలయాల యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆలయాన్ని నీటితో శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు..

అయితే యాదాద్రి ఆలయంలో బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయడం వివాదంగా మారింది. ఆలయ తూర్పు రాజగోపురం మాడవీధుల్లో హరీష్ రావు.. పాప పరిహార సంకల్ప ప్రమాణం చేసిన ప్రాంతం, ఆలయ పరిసరాలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ నేతలు నీటితో శుద్ధి చేశారు. బీఆర్ఎస్ నేతలు పరిహార సంకల్పం చేసి కొండను అపవిత్రం చేశారని.. మాడ వీధుల్లో చీపుర్లు పట్టి ఊడ్చి నీటితో శుద్ధి చేశారు. యాదాద్రి కొండపై బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్పం చేయడం, కాంగ్రెస్ నేతలు నీటితో శుద్ధి చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

బీఆర్ఎస్ నేతలు యాదగిరిగుట్ట ఆలయాన్ని అపవిత్రం చేశారని, దేవుడి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడి హరీష్ రావు ఆలయానికి మైల పట్టించాడని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతులను పట్టించుకోని బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలోనే పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో.. రాజకీయాలు చేస్తే సహించం. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు..” అని ప్రభుత్వ విప్ “బీర్ల ఐలయ్య బిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు..

మాజీ మంత్రి హరీష్ రావు ఆలయ మాడ వీధుల్లో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయడంపై ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయడంపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బిఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారంటూ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఆలయ ఈవో ఫిర్యాదు చేశారు. దీంతో యాదగిరిగుట్ట పోలీసులు హరీష్ రావు తోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, గుర్తుతెలియని పూజారితోపాటు మరో నలుగురిపై యాదగిరిగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందని ఆలయ ఈవో భాస్కరరావు చెబుతున్నారు.

రుణమాఫీ వివాదంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..