Revanth Reddy: రూ.35 వేల కోట్లు దారి మళ్లించారు.. జీతాలు ఇవ్వాలంటే అప్పు తేవాల్సిన పరిస్థితి నెలకొందన్న రేవంత్ రెడ్డి
గ్రామ పంచాయతీ నిధులపై మళ్లీ కదం తొక్కారు సర్పంచ్లు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను అప్పు చేసి పూర్తి చేశాం.. ఇప్పటికైనా నిధులు విడుదల చేయండి మహాప్రభో అని నినదించారు. సర్పంచ్ల శంఖారావానికి మద్దతిచ్చింది తెలంగాణ కాంగ్రెస్.

ప్రగతి పేరుతో ప్రభుత్వ లక్ష్యాలు.. గడువులోగా పూర్తికాకుంటే అధికారుల హెచ్చరికలు.. వెనుకడుగు వేస్తే ప్రజల ఒత్తిళ్లు. వీటన్నింటి మధ్య గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ సతమతమవుతున్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల నిధులు మళ్లించిందనే ఆరోపణలతో సర్పంచ్లో కొద్దిరోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. లేటెస్ట్గా హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నిధులు, విధులపై సర్పంచ్ల శంఖారావం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులు మళ్లించిందన్నది సర్పంచ్ల ఆరోపణ.
గ్రామాల్లో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని.. అవి పూర్తి కావాలంటే నిధులు వెంటనే విడుదల చేయాలంటున్నారు. తమకు తెలియకుండా రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు.. బ్యాంకు ఖాతాల డిజిటల్ కీ ఆధారంగా ఈ నిధులను విత్ డ్రా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ల శంఖారావానికి తెలంగాణ కాంగ్రెస్ మద్దతిచ్చింది. గ్రామపంచాయతీల నిధులు ప్రభుత్వం దారి మళ్లించడంతో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం సర్పంచ్లు, విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తోంది. ప్రభుత్వ ఖాతాల్లోకి నిధులు మళ్లించలేదంటోంది. కేంద్ర ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను ఖర్చు చేస్తేనే రెండో విడత నిధులు విడుదలవుతాయని.. అందుకే ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులకి చెల్లించామంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం