Telangana: సక్సెస్ బాటలో తెలంగాణ యూరియా యాప్
రైతులకు యూరియా సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్కు విశేష స్పందన లభిస్తోంది. ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన యూరియా యాప్ పనితీరు విజయవంతం అవుతోంది. యూరియా ఈజీగా సప్లయ్ అవుతుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు.. తెలంగాణ వ్యాప్తంగా యాప్ అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు.

యూరియా పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను ఆదిలాబాద్, జనగామ, మహబూబ్నగర్, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. యాప్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 19 వేల 695 మంది రైతులు యాప్లో బుకింగ్ చేసుకోగా.. మొత్తం 60 వేల 510 యూరియా బస్తాలు కొనుగోలు చేశారు. ఇందులో 217 మంది కౌలు రైతులు 678 బస్తాల యూరియాను బుక్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా డీలర్ వారీగా యూరియా స్టాక్ వివరాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఓటీపీ విధానంతో రైతులు తమకు నచ్చిన సమయంలో యూరియాను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే.. యాప్ ప్రారంభ దశలో ఎదురైన ప్రాథమిక సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. యాప్ అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతోందని వెల్లడించారు. ఇక.. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా యూరియా యాప్ను అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలోని రబీ సీజన్ అవసరాల కోసం ఇప్పటికే 5 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. దీంతోపాటు.. వచ్చే జనవరి, ఫిబ్రవరి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తుమ్మల చెప్పారు. మొత్తంగా.. యూరియా యాప్ విజయవంతంగా కొనసాగితే.. తెలంగాణలో రైతులకు మరింత సులభంగా ఎరువుల సరఫరా జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
