Rain Alert: మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! కోరలు చాస్తోన్న డెంగీ జ్వరాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగాల 2 రోజులలో తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుండి..

Rain Alert: మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! కోరలు చాస్తోన్న డెంగీ జ్వరాలు
Rain Alert
Follow us

|

Updated on: Aug 23, 2024 | 9:53 AM

హైదరాబాద్, ఆగస్టు 23: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగాల 2 రోజులలో తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వానలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లా రేవెల్లిలో అత్యధికంగా 9.65 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

కోరలు చాస్తోన్న డెంగ్యూ జ్వరాలు

మరోవైపు వర్షాల దాటికి రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు గరిష్టంగా ప్రబలుతున్నాయి. జూలై 1 నుంచి ఆగస్టు 18 మధ్యకాలంలో రాష్ట్రంలో మూడువేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 32 వేల కేసులు నమోదయ్యాయి. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు పదిశాతం మేర ఉన్నయాన్నమాట. అందులో అత్యధిక కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉండటం గమనార్హం. డెంగీతో పాటు ఇతర సీజనల్‌ వ్యాధులూ వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రోగులతో సర్కారు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యపరీక్షల కిట్ల కొరత కారణంగా బాధితులను ప్రైవేటు కేంద్రాలకు పంపిస్తున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాలలో డెంగీ జ్వరాల తీవ్రతకు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు.

గతంలోనూ వైరల్ జ్వరాలు వచ్చేవని.. అయితే అవి మందులు వేసుకున్నా లేకున్నా మూడు నాలుగురోజులు తర్వాత తగ్గేవని, ఇప్పుడు పది రోజులవుతున్నా జ్వరాలు తగ్గడం లేదని, శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా త్వరగా పడిపోతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ఈ జ్వరాల బారిన పడి మృతి చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ విభాగాన్ని పటిష్టవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధులపై ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త, నీటి నిల్వలతో డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను యుద్ధ ప్రాతిపదికన నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.