Nizamabad Corporation Election Result : నిజామాబాద్లో బీజేపీ హవా.. అర్వింద్ ఇలాకాలో అదరగొట్టిన కమలం పార్టీ..
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీల ఫలితాల సరళిని ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకుంటున్నప్పటికీ, ఉత్తర తెలంగాణలో మాత్రం బీజేపీ తన పట్టును నిలుపుకుంది.కరీంనగర్ తర్వాత ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ బీజేపీ విజయం ఖరారైంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొదటి నుండి బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా మరికొన్ని స్థానాల్లో స్పష్టమైన లీడ్లో ఉంది. కాంగ్రెస్ 15 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇతరులు10 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.
బీజేపీ మేజిక్ ఫిగర్కు చేరువలో ఉండటంతో మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడం ఇప్పుడు లాంఛనమే అయింది. కరీంనగర్ తరహాలోనే ఇక్కడ కూడా ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్అఫీషియో ఓట్లు బీజేపీకి అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జోరు చూపించింది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బోధన్ మున్సిపాలిటీ(38)లో కాంగ్రెస్ పార్టీ 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ(36)లో కాంగ్రెస్ పార్టీ 19, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. భీమ్గల్ మున్సిపాలిటీ(12)లో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈ మూడు మున్సిపాలిటీలు కూడా హస్తగతమయ్యాయి.
కాగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా చాటింది. నల్గొండ, రామగుండం వంటి కార్పొరేషన్లను హస్తం పార్టీ స్వీప్ చేయగా.. నిజామాబాద్, కరీంనగర్ వంటి కీలక నగరాల్లో బీజేపీ గట్టి పోటీని ఇచ్చి పీఠాలను కైవసం చేసుకోవడం విశేషం.
