రానున్న రెండు రోజులు జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ట్రాఫిక్ సూచనలు, ఐఎండీ హెచ్చరికలను పాటించాలని కోరారు. మూతలేని మ్యాన్హోల్స్, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

నగరంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప భారీ వర్షాల సమయంలో బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసే వాతావరణ హెచ్చరికలు, సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటికి అనుగుణంగా రోజువారీ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని వెల్లడించారు.
గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితులను కమిషనర్ స్వయంగా పరిశీలించి, ట్రాఫిక్ సజావుగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ రద్దీని నియంత్రించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందిస్తారని చెప్పారు. భారీ వర్షాల సమయంలో మూతలేని మ్యాన్హోల్స్, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల సమీపంలో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారించాలని కోరారు.
అత్యవసరం అయితే తప్ప ఇంట్లోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన కమిషనర్.. అత్యవసర పరిస్థితులు లేదా ట్రాఫిక్కు సంబంధించిన సహాయం కోసం 100కు ఫోన్ చేయాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల ద్వారా జారీ చేసే ట్రాఫిక్ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
