AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. ఎలన్ మస్క్ సంచలన ప్రకటన

భవిష్యత్తులో డబ్బుకు విలువ ఉండదా? ఏఐ (AI), హ్యూమనాయిడ్ రోబోలు మన ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయనున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్. ద ఎకనామిస్ట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం పదండి.

Elon Musk: రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. ఎలన్ మస్క్ సంచలన ప్రకటన
Elon Musk Ai Prediction
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Jul 31, 2026 | 2:07 PM

Share

భవిష్యత్తులో డబ్బుకు విలువ ఉండదా? ఏఐ (AI), హ్యూమనాయిడ్ రోబోలు మన ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయనున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్. ద ఎకనామిస్ట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో, అంటే 2036 నాటికి సమాజంలో డబ్బు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందని ఆయన కచ్చితంగా జోస్యం చెప్పారు. మస్క్ చెప్పిన ఈ కొత్త ఆలోచన వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, అందులో ఓ బలమైన లాజిక్ ఉంది. భవిష్యత్తులో మనుషులు చేసే దాదాపు అన్ని పనులను ఏఐ, రోబోలే చేస్తాయని ఆయన అంచనా వేశారు. మనుషులకు కావాల్సిన వస్తువులు, సేవలను యంత్రాలే అత్యంత వేగంగా, సులభంగా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వస్తువుల కొరత అనేదే ఉండదని, ప్రతి ఒక్కరికీ అన్నీ అందుబాటులో ఉండే రోజులు వస్తాయని మస్క్ స్పష్టం చేశారు.

ఈ మార్పు వల్ల సమాజం ఒక ‘సమృద్ధి యుగం’ లోకి అడుగుపెడుతుందని మస్క్ వివరించారు. ఆ ప్రపంచంలో పని చేయడం అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే అవుతుంది. అంటే, ఇష్టం ఉంటే పని చేయొచ్చు, లేదంటే లేదు. వస్తువులు, సేవలు అందరికీ చాలా సులభంగా అందుబాటులోకి వస్తాయి. దీని ప్రభావం నేరుగా మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ప్రస్తుతం మనం పాటిస్తున్న జీతాలు, పొదుపు, రిటైర్మెంట్ లాంటి సంప్రదాయ ఆర్థిక విధానాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికీ రోబోలు ఉన్నప్పుడు, మనుషులకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం, ఆదా చేసుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మనుషులు తమ సమయాన్ని కేవలం సృజనాత్మక పనులకు మాత్రమే కేటాయించే స్వేచ్ఛ దొరుకుతుందని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

కేవలం ఆర్థిక మార్పులే కాకుండా, ఏఐ సాంకేతికత అభివృద్ధిపైనా మస్క్ కీలక అంచనాలు వేశారు. రాబోయే ఐదేళ్లలో ఏఐ టెక్నాలజీ ప్రపంచంలోని మనుషులందరి మేధస్సు కంటే ఎక్కువ తెలివైనదిగా మారుతుందని ఆయన అంచనా వేశారు. ఇది మానవాళి చరిత్రలోనే ఒక ఊహించని పరిణామంగా మారనుందని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్పులను తక్కువ అంచనా వేయలేమని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.

అయితే, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతతో ప్రమాదాలు కూడా ఉన్నాయని మస్క్ అంగీకరించారు. ఫ్రాంటియర్ ఏఐ మీద పనిచేస్తున్న కంపెనీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఒక కొత్త ఏఐ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు, ఇతర కంపెనీలు ఆ మోడల్‌ను సమీక్షించాలని ఆయన సూచించారు. మస్క్ దార్శనికత భవిష్యత్తుపై కొత్త ఆశలు రేపుతున్నా, ఎన్నో ప్రశ్నలను కూడా తెరపైకి తెస్తోంది. యంత్రాలే అన్ని పనులు చేసే ప్రపంచంలో డబ్బుకు అర్థం ఏమిటి? డబ్బు అవసరం లేని ఆ సమాజం మనుషులకు నిజమైన స్వేచ్ఛను ఇస్తుందా, లేక అల్లకల్లోలానికి దారి తీస్తుందా?

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలకు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us