School Holiday on August 1st: రేపు ఏపీలో ఈ స్కూళ్లకు సెలవ్.. ఎందుకో తెల్సా?
ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు చెందిన అధికారులు ప్రకటన జారీ చేశారు..

అమరావతి, జులై 31: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు రానున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు అధికారులు శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను వినియోగించనున్నందున రవాణా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే అధికారుల నుంచి సమాచారం అందింది. దీంతో ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించకుండా సెలవులు ప్రకటించాలని సూచించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలు సాధారణ షెడ్యూల్ ప్రకారమే కొనసాగనున్నాయి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సులను కార్యక్రమ నిర్వహణ కోసం వినియోగించనున్నందున విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు.
