Congress: కాంగ్రెస్ పార్టీలో అప్పుడే అసమ్మతి రాగం.. ఇంద్రవెల్లి సభకు కీలక నేతల డుమ్మా.. కారణం అదేనా..?
దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దళితులతోపాటు గిరిజనులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఆందోళన చేసేందుకు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేసింది.

Telangana leaders to Indravelli: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దళితులతోపాటు గిరిజనులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పార్టీ రానున్న రోజుల్లో ఆందోళన చేసేందుకు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేసింది. ఈనేపథ్యంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోర సభకు.. ఆ పార్టీ ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. ఇంద్రవెల్లి సభ ప్రకటన చేసినప్పటి నుండి అనేక కీలక పరిణామాలు జరిగాయి. స్థానికంగా ఉన్న నాయకుల నుండి మొదలు పెడితే రాష్ట్రస్థాయి నాయకుల వరకు విభేదాలు భగ్గుమన్నాయి. సమాచారం లేకుండా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ దండోరా సభకు డుమ్మా కొట్టారు ఆ పార్టీ నాయకులు. ఇంత పెద్ద సభలో ఆ బడానేతలు కానరాకపోయేసరికి ఆపరేషన్ సక్సెస్ పేషేంట్ డైడ్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ తల పెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు కీలక నేతలు గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అంతా తామే అన్నట్టు ఉండే ఆ నాయకులు ఎందుకు ఇంద్రవెల్లి సభకు దూరంగా ఉన్నారు.. కాంగ్రెస్లో కోల్డ్ వార్ ఇంకా తగ్గలేదా.. వారు కావాలనే.. పక్కకు జరుగుకున్నారా.. లేకా ఆ నాయకులను కావాలనే పక్కన పెట్టారా.. అసలు నల్గొండ జిల్లాకు చెందిన ఆ పెద్ద నాయకులు ఎక్కడా అంటూ కాంగ్రెస్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, తాజా మాజీ పీసీసీ చీఫ్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలతో పాటు మాజీఎంపీలు పొన్నం ప్రభాకర్, చెన్నారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు సైతం గైర్హాజరు అయ్యారు. అయితే, దీని వెనుక కారణాలు ఏంటా అని అప్పుడే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదే క్రమంలో మొన్నటి వరకు పీసీసీ అధ్యక్షుడు గా కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య పార్టీ కార్యక్రమాలలో అంత చురుగ్గా పాల్గొనటం లేదు. ఇంద్రవెల్లి సభ నుండి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలలో ఉత్తమ్ పాల్గొంటారు అనుకున్న నాయకులకు నిరాశే ఎదురైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంద్రవెల్లి సభకు డుమ్మా కొట్టడం వెనుక పార్టీలో ఆయనకు సరియైన ప్రాధాన్యత లేకపోవడమే అంటున్నారు నేతలు. రాష్ట్ర పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలు సైతం ఆయన దృష్టికి రాకపోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేతల భేటీకి సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడంలేదని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఇంద్రవెల్లిలో లక్ష మందితో దళిత, గిరిజన దండోరా సభ ఏర్పాటుకు సంబంధించి సమాచారం లేకపోవడం వల్లనే ఆయన రాలేక పోయారని ఉత్తమ్ అనుచరులు అనుకుంటున్నారు.
చివరివరకు పీసీసీ రేసులో ఉండి భంగపడిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలకు ఇంద్రవెల్లి సభకు సంబంధించి కనీసం ఆహ్వానం కూడా అందలేదట. దీనిపై అసంతృప్తిగా ఉన్నారట కోమటిరెడ్డి సోదరులు. సభ ఏర్పాటుకు సంబంధించి వారిని ఎవరు సంప్రదించలేదని బాహాటంగానే అంటున్నారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్.. పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న కారణంగా రాలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం సభకు డుమ్మా కొట్టారు. వారం రోజుల ముందు నుంచే సభా ఏర్పాట్ల పై ప్రేమ్ సాగర్ రావుతో చర్చించి సభను విజయవంతం చేయడానికి కృషి చేసిన జగ్గారెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, కోర్టు పనులు కారణంగా ఇంద్రవెల్లి సభకు వెళ్లలేక పోయారని అయన వర్గీయులు చెప్పుకొచ్చారు. అయితే, కారణాలు ఏవి అయిన, పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సభకి ముఖ్యనేతలు రాకపోవడం పట్ల కార్యకర్తలు అయోమయంలో పడ్డారట.
ఈ నేపథ్యంలోనే ఇంద్రవెల్లిలో దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనంతరం ఇదే ఉత్సహాంతో మరిన్ని సభలను నిర్వహిస్తామని ప్రకటించింది..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలించి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుండి సెప్టెంబర్ 17 వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్ చెప్పారు. ఇక, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కానున్నారని ఆయన నిన్న ప్రకటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు సభలను నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇక ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. పాత కొత్త పార్టీ నేతలంతా ఒకే వేదిక మీద చేరారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలనే యోచనలో ఆపార్టీ ఉంది. అయితే, కీలక నేతలు వివిధ కారణాల చేత సభకు రాలేక పోవడంతో ఇబ్రహీంపట్నంలో ఈ నెల 17న జరిగే దళిత దండోరా సభకు కాంగ్రెస్ పెద్ద నేతలు అందరూ పాల్గొనాలని.. లేకపోతే క్యాడర్లో తప్పుడు సంకేతాలు అందే ప్రమాదం ఉందని కొంతమంది నేతలు అంటున్నారు. మరి ఈ నాయకులు ఇబ్రహీంపట్నం సభకు వస్తారో రారో వేచి చూడాలి.
— అశోక్ భీమనపల్లి, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.
Read Also.. Revanth Reddy: దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు.. ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్
