Telangana: రేవంత్ సర్కార్ తీపికబురు.. వారికి భారీగా రుణమాఫీ నిధులు విడుదల!
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థికంగా కుంగిపోయిన చేనేత కార్మికుల భారం తగ్గించేందుకు రూ.33 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు ఎదురుచూస్తున్న రుణమాఫీ ప్రక్రియ అధికారికంగా..

చేనేత రంగానికి తెలంగాణ భారీ ఊపిరి పోసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థికంగా కుంగిపోయిన చేనేత కార్మికుల భారం తగ్గించేందుకు రూ.33 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు ఎదురుచూస్తున్న రుణమాఫీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. విడుదలైన మొత్తాన్ని పూర్తిగా రుణాల క్లియరెన్స్కే వినియోగించనున్నారు. ఇందుకోసం హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, అప్పారెల్ ఎక్స్పోర్ట్ పార్క్స్ కమిషనర్కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. లబ్ధిదారుల వివరాలు ఖరారు చేసిన తర్వాత.. వారి అప్పుల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా వ్యవస్థను రూపొందించారు.
ఈ నిర్ణయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతిస్తూ.. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం చూపిన స్పందనను మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అప్పుల బాదరబందీకి ఈ నిధుల విడుదల కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇది వరుసగా జరుగుతున్న రెండో పెద్ద రుణమాఫీ కార్యక్రమం. ఇటీవల భారీ స్థాయిలో రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు కనిపించాయి. ఇప్పుడు చేనేత రంగంపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల తన బాధ్యతను ప్రభుత్వం మరోసారి చాటుకుంది. చేనేత పరిశ్రమ సాంప్రదాయ కళాకారుల నైపుణ్యంపై ఆధారపడే వృత్తి. ఇటీవలి సంవత్సరాల్లో మార్కెట్ మార్పులు, అప్పుల భారంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త రుణమాఫీ ప్యాకేజీ వారికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదు. వృత్తిని కొనసాగించేందుకు అవసరమైన నమ్మకాన్ని కూడా ఇస్తుందని చేనేత రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




