ఐఎన్ఐ సెట్ 2025లో తెలుగమ్మాయి సత్తా.. ఏకంగా ఆలిండియా 7వ ర్యాంకు కైవసం
పీజీ మెడికల్ కోర్సుల్ల ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్ 2025 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి సత్తా చాటింది. ఏకంగా ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది. ఎంతో పోటీ ఉండే ఈ ఐఎన్ఐ సెట్లో..

నరసరావుపేట, నవంబర్ 18: పీజీ మెడికల్ కోర్సుల్ల ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్ 2025 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి సత్తా చాటింది. ఏకంగా ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది. ఎంతో పోటీ ఉండే ఈ ఐఎన్ఐ సెట్లో (ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్–కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్) దేశ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతుంటారు. అయితే త్రిషారెడ్డి తొలి ప్రయత్నంలోనే ఆలిండియాలో 7వ ర్యాంకు సాధించింది. ఇక దక్షిణాదిలో త్రిషారెడ్డిదే మొదటి ర్యాంకు కావడం విశేషం. త్రిషారెడ్డి సాధించిన ఈ ఘనతపై ఆమె తల్లిదండ్రులు బారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, అనంత లక్ష్మిలు సంతోషం వ్యక్తం చేశారు.
త్రిషారెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణం గురజాల మండలం తేలుకుట్ల. అయితే ఆమె కుటుంబం వ్యాపారరీత్యా ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. త్రిషా ఐదేళ్ల క్రితం నీట్ యూజీ ఎంట్రన్స్లో ఆలిండియా 14వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇక ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించిన జనవరి సెషన్ ఐఎన్ఐ సెట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ద్వారా దేశంలోని వివిధ ఎయిమ్స్లతో పాటు కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు కల్పిస్తారు. ఐఎన్ఐ సెట్ 2025 పరీక్ష నవంబర్ 9న జరిగింది. ఈ ఫలితాలను శనివారం రాత్రి ఎయిమ్స్ విడుదల చేసింది. అతి చిన్న వయసులోనే ఎంతో కఠినమైన పరీక్షలో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకు సాధించిన సాయి త్రిషారెడ్డిని పలువురు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








