Rythu Bharosa: తెలంగాణ రైతులకు బిగ్ న్యూస్.. అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు.. ఎప్పుడంటే..?
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. త్వరలోనే రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15న సంక్రాంతి పండగ ఉండగా.. ఆ లోపే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల విడుదలకు సిద్దమైంది.

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులు రైతు అకౌంట్లలో జమ చేసేందుకు సిద్దమవుతోంది. సంక్రాంతి పండక్కి ముందే నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని రైతులందరూ త్వరలోనే రైతు భరోసా డబ్బులు అందుకోనున్నారు. యాసంగి సాగు కోసం ఈ పెట్టుబడి సాయం అందించనుంది. యాసంగి సీజన్లో పంట వేసిన రైతులందరికీ త్వరలో అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు వేసిన భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పంట భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వనుంది.
ఎకరానికి రూ.6 వేలు
రైతుబంధు పథకంలో భాగంగా గతంలో ఎకరానికి రూ.5 వేలు అందించేవారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.6 వేలు ఇవ్వనున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో దాదాపు కోటిన్నర ఎకరాలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. గత ఏడాది యాసంగిలో సుమారు 79.54 లక్షల ఎకరాల్లో పంట సాగయినట్లు అధికారులు క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా గుర్తించారు. ఈ సారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంటలు సాగవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు సాగు వివరాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ త్వరలోనే వ్యవసాయశాఖకు అందనుండగా.. ఆ తర్వాత డబ్బులు రిలీజ్ చేయనున్నారు.
రూ.9 వేల కోట్లు విడుదల
ఈ యాసంగి సీజన్కు రైతు భరోసా పధకం అమలు చేయడానికి రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖకు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ముందే రైతులకు నిధులు జమ చేస్తే రైతు ఆనందం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావించింది. దీంతో పండుగలోపే లబ్దిదారులందరికీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా త్వరలో రైతు భరోసా నిధులను జమ చేస్తామని, ప్రస్తుతం సర్వే పూర్తయ్యే దశకు చేరుకుందని ప్రకటించారు. దీంతో రైతు భరోసా నిధుల విడుదలకు మార్గం సుగమం అయిందని చెప్పవచ్చు.
