May 25, 2026
Subhash
స్మార్ట్ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచిన మొబైల్ తయారీ సంస్థలు. మరో దఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా మెమరీ చిప్ల ధరలు భారీగా పెరుగడంతో స్మార్ట్ఫోన్ల రేట్లనూ మరోసారి పెంచడానికి రెడీ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
ఇందుకు ప్రధాన కారణం మెమరీ చిప్ల ధరలు పెరగడమేనని ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ చందక్ అన్నారు.
మెమరీ కార్డు తయారీ సంస్థలు భారత్లో ప్లాంట్లు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక్కడ చిప్లను తయారు చేయడానికి భారీగా ఖర్చవుతుందని, అంతర్జాతీయ చిప్ తయారీ దిగ్గజాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకుతోడు రూపాయి మారకం విలువ పాతాళంలోకి పడిపోతుండటంతో మొబైల్ తయారీ సంస్థలూ తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయా మాడళ్ల ధరలను సవరించేస్తున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నాయని తెలుస్తోంది.
వీటన్నింటిని చూస్తుంటే రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.