Schools Reopen: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం ఆదేశం
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు పున:ప్రారంభించాలని నిర్ణయించింది.
![Schools Reopen: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం ఆదేశం](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/08/schools-reopen-in-india.jpg?w=1280)
Schools Reopen from September 1: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు పున:ప్రారంభించాలని నిర్ణయించింది. అంగన్ వాడీల కేంద్రాలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పున: ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గడంతో విద్యాసంస్థలు తెరవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. కరోనా అదుపులోకి వచ్చిందని నివేదికలు వచ్చాయి. ఎక్కువ కాలం పాఠశాలలు మూసివేస్తే పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది. పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని వైద్యశాఖ అధికారులు చెప్పారు
కరోనా కారణంగా విద్యారంగంలో ఆయోమయం నెలకొంది. విద్యార్థులు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ఇప్పటికే తెరుచుకుని భౌతికంగా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్లైన్ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఈనెలలోనే విద్యాసంస్థలు తెరిచాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
Read Also… Kashmir: భూలోక స్వర్గం కశ్మీర్లో ఈ 3 చాలా సుందరమైన ప్రదేశాలు.. ప్రతి ఒక్కరు చూడదగినవి..
Taliban Panjshir: తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారిన అందాల లోయ.. పంజ్షిర్ నుంచి సింహగర్జన..!