AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీసీ కెమెరాలకు పోజులిస్తూ.. దర్జాగా ఏటీఎంలను దోచేశారు.. ఇంతకీ వీరి టెక్నిక్ ఏంటో తెలిస్తే ఫ్యూజులౌట్!

ఖమ్మం జిల్లాలో వరుసగా ATMలలో చోరీలు సంచలనం సృష్టిస్తున్నాయి. అది కూడా ఒకే సంస్థకు చెందిన డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలను మాత్రమే టార్గెట్ చేసి..

Telangana: సీసీ కెమెరాలకు పోజులిస్తూ.. దర్జాగా ఏటీఎంలను దోచేశారు.. ఇంతకీ వీరి టెక్నిక్ ఏంటో తెలిస్తే ఫ్యూజులౌట్!
Bank Thefts
N Narayana Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 13, 2023 | 10:04 PM

Share

ఖమ్మం జిల్లాలో వరుసగా ATMలలో చోరీలు సంచలనం సృష్టిస్తున్నాయి. అది కూడా ఒకే సంస్థకు చెందిన డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలను మాత్రమే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు దొంగలు. పట్టపగలు పట్టణ ప్రాంతాలలో నడిబొడ్డున ఉన్న డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలను టార్గెట్ చేస్తూ.. సీసీ కెమెరాల ముందు ఫోజులు ఇస్తూ ఎలాంటి జంకు లేకుండా మరి చోరీ చేశారు అంతరా రాష్ట్ర దొంగల ముఠా. ఎక్కడా ఎవ్వరి ఏటీఎం కార్డులు కొట్టెయ్యలేదు. అలాగే ఏ ఏటీఎంను ధ్వంసం చెయ్యలేదు. వేరే ఎవ్వరి ఖాతాల నుంచి నగదు కాజెయ్యలేదు. మరి చోరీ ఎలా సాధ్యమైంది?

కేవలం డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలను టార్గెట్ చేస్తూ ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏటీఎంల నుంచి సుమారు 8 లక్షల రూపాయలు దోచేశారు. వేరే ఏ ఇతర ఏటీఎంల జోలికి వెళ్లకుండా డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలనే టార్గెట్ చేశారు అంటే.. డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంల సాప్ట్‌వేర్ సిస్టమ్ మీద అవగాహన కలిగిన ముఠా అయ్యుంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంల ఆపరేటింగ్ సిస్టమ్‌పై సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం కలిగిన దొంగల ముఠాకు, డీసీసీబీ బ్యాంక్ ఏటీఎం ఆపరేటింగ్ సిస్టమ్ అథారిటీ కంపెనీలకు మధ్య సంబంధాలు ఉండి ఉంటాయని ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ఆ కంపెనీలో సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉన్నవారితో కలిసి తెలివిగా ఏటీఎంలను ఎలాంటి డ్యామేజ్ చెయ్యకుండా కేవలం డమ్మీ ఏటీఎం కార్డులతో 8 లక్షలు నగదు కాజేసిన విధానంపై CCS పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ దొంగల ముఠాను అదుపులోకి తీసుకొని దోచుకున్న సొత్తును రికవరీ చేసేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

తల్లాడ మండల కేంద్రాల్లో డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలలో ఏటీఎం కార్డులతో గుర్తుతెలియని దొంగలు నగదు చోరీ చేశారు. జూలై ఒకటో తేదీన వైరాలో సాంకేతిక పరిజ్ఞానంతో 17 ఏటీఎం కార్డులతో నాలుగు లక్షల 16 వేల రూపాయలు.. తల్లాడలో 11 ఏటీఎం కార్డుల ద్వారా 2 లక్షల 80 వేల రూపాయల నగదు చోరీ చేశారు. ఈనెల ఒకటో తేదీన అంతర్రాష్ట్ర దొంగలు 17 ఏటీఎం కార్డులు ద్వారా 30 సార్లు నగదు చోరీకి పాల్పడ్డారు. అంతర్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగదు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు సిబ్బంది ఏటీఎంలలో నగదు పెట్టే సమయంలో నగదు కౌంటింగ్ తేడా రావడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ సీసీ ఫుటేజ్‌లను తనిఖీ చేశారు. దీంతో ఈ తతంగం అంతా బయటపడింది. ఆ తర్వాత తల్లాడ, వైరా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు బ్యాంక్ సిబ్బంది. దీంతో వైరా, తల్లాడ ఎస్సైలు బ్యాంకు ఏటిఎంలను పరిశీలించి సిసి ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.