హైదరాబాద్లో మిస్సింగ్.. ఏపీలోని బావిలో డెడ్బాడీ.. ఇన్స్టా రీల్తో
హైదరాబాద్లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ ఆచూకీ పోలీసుల దర్యాప్తుతో కాకుండా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో బయటపడింది. అయితే అప్పటికే ప్రకాశం జిల్లాలోని ఓ పాడుబడ్డ బావిలో అతని మృతదేహం లభించడం విషాదాన్ని మిగిల్చింది.

హైదరాబాద్లో అదృశ్యమైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆచూకీ పోలీసుల దర్యాప్తుతో కాదు.. కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో బయటపడింది. అయితే అప్పటికే ఆ విద్యార్థి మృతదేహం ఆంధ్రప్రదేశ్లోని ఓ బావిలో లభించడం విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాహుల్ (21) హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మే 27 నుంచి రాహుల్ కనిపించకుండా పోవడంతో, మే 31న కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాహుల్ తండ్రి అంకం రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న తన కుమారుడి స్నేహితుడు ఆకాశ్ ఫోన్ చేసి రాహుల్ కనిపించడం లేదని చెప్పాడు. వెంటనే హైదరాబాద్కు చేరుకున్న ఆయన మొదట సైదాబాద్ పోలీసులను ఆశ్రయించగా, చివరిసారిగా రాహుల్ కాచిగూడ ప్రాంతంలో కనిపించడంతో కాచిగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లాలని సూచించారు. అనంతరం అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, రాహుల్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వెళ్లే ముందు తాను స్నేహితులతో బయటకు వెళ్తున్నానని మరో స్నేహితుడికి చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్ వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ వ్యక్తి జూన్ 4న కుటుంబానికి ఫోన్ చేసి, కొన్ని రోజుల క్రితం అక్కడ ఓ పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించిందని సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా, అప్పటికే మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి ఖననం చేసినట్లు తెలిసింది. అనంతరం రాహుల్ తల్లి డీఎన్ఏ నమూనాలను పరీక్షించగా, బావిలో లభించిన మృతదేహం రాహుల్దేనని నిర్ధారణ అయింది. రాహుల్ మరణానికి ముందు ఓ యువతి విషయంలో కొందరు విద్యార్థులు అతడిని బెదిరించారని, వారి పాత్రపై తమకు అనుమానాలు ఉన్నాయని రాహుల్ తండ్రి ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని పేర్కొంటూ, కేసును సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
