Telangana: మనోడు సుడిగాడే.. లక్కీ డ్రాలో ఏకంగా 4 లిక్కర్ షాపులు దక్కాయిగా..
తెలంగాణలో మద్యం షాపులకు లక్కీడ్రా పూర్తయింది. జిల్లాల వారిగా మద్యం షాపులకు డ్రా నిర్వహించారు. ఆ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి నాలుగు షాపులను కైవసం చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి 14 టెండర్లు వేయగా.. జాక్ పాట్లో నాలుగు షాపులు సొంతం చేసుకున్నాడు.

మంచిర్యాల జిల్లాలో చెట్ల రమేష్ అనే వ్యక్తి సిండికేట్లో 14 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయగా.. ఏకంగా 4 షాపులు దక్కించుకున్నారు. అది కూడా వరుసగా నాలుగు దుకాణాలను సొంతం చేసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి దుర్గమాత పేరుతో మంచిర్యాల జిల్లాల్లోని 14 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేసి 42 లక్షలు టెండర్లకు చెల్లించారు. అదృష్టం కలిసి రావడంతో నాలుగు దుకాణాలను సొంతం చేసుకున్నాడు.
మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లోని 44 నెంబర్ షాపు వరుసగా మూడుసార్లు ఒకే వ్యక్తికి దక్కింది. కోటపల్లి మండలం నీల్వాయికి చెందిన రుద్రబంట్ల సంతోష్కు కైవసం అయింది. గతంలో రెండుసార్లు ఇదే షాపు ఆయన పేరిట రాగా.. ఈసారి 12 మంది స్నేహితులు కలిసి గ్రూపుగా ఏర్పడి 12 షాపులకు దరఖాస్తు చేశారు. మళ్లీ ఆయన పేరిట అదృష్టం వరించడంతో ఆనందం వ్యక్తం చేశారు తోటి స్నేహితులు.
నిర్మల్ జిల్లాలో లక్కీ లేడీగా నిలిచింది గుర్రామ హరీక అనే మహిళ. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. ఆమెకు రెండు షాపులు దక్కడంతో జాక్ పాట్ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా మద్యం షాపుల డ్రాలో ఒక్కోచోట ఒక్కో వింత చోటు చేసుకుంది.



