Telangana: కలిసి జీవించలేమనుకున్న ఓ జంట.. మరణంతో ఒకటయ్యారు..!
ఒకే ఫ్యానుకు ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అరుణ్, అలేఖ్యల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యతో చిత్యలపల్లి, భూపాలపట్నం గ్రామాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

కలిసి జీవించలేమనుకున్న ఓ జంట.. మరణంతో ఒకటయ్యారు. ఈ తీవ్ర విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దలు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రేమజంట ఒకే ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవలె నిశ్చితార్థం పూర్తి చేసుకున్న యువతి, ప్రియుడితో కలిసి ప్రాణాలు వదిలింది. జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
చొప్పదండి మండలం చిత్యలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్, భూపాలపట్నానికి చెందిన నాంపల్లి అలేఖ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుణ్ కుమార్ కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు. కరీంగనర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న అలేఖ్య కొంతకాలంగా ఇంట్లోనే ఉంటోంది.
ఇదిలావుంటే, అలేఖ్యకు మరో అబ్బాయితో నిశ్చితార్థం చేశారు తల్లిదండ్రులు. దీంతో తమ ప్రేమ ఫలించదేమోనని, కలిసి జీవించడం సాధ్యం కాదని అరుణ్, అలేఖ్యలు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం(ఫిబ్రవరి 6) నాడు కరీంనగర్లోని తన మిత్రుడి ఇంటికి అలేఖ్యను తీసుకెళ్లిన అరుణ్ కుమార్ తనువు చాలించాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోని ఓ గదిలో ఒకే ఫ్యానుకు ప్రేమికులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అరుణ్, అలేఖ్యల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యతో చిత్యలపల్లి, భూపాలపట్నం గ్రామాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
