Telangana: వామ్మో.! మీ పాత ఫోన్లు అమ్ముతున్నారా.. ఎంత డేంజరో తెలిస్తే
ఆదిలాబాద్ జిల్లాలో భారీ సైబర్ కుట్ర భగ్నమైంది. విధుల్లో చేరిన తొలిరోజే సైబర్ కేటుగాళ్ల భరతం పట్టారు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్. ఊరూరా తిరుగుతూ పాత పోన్లు సేకరించి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడేందుకు ఓ ముఠా వేసిన కుట్రను ఆదిలాబాద్ పోలీసులు చేధించారు.

ఆదిలాబాద్లో భారీ సైబర్ కుట్ర భగ్నమైంది. పాత ఇనుప సామాన్లు, స్టీల్ సామాన్ల ముసుగులో పాత ఫోన్లను కొనుగోళ్లు చేస్తూ.. ఆ ఫోన్లను బీహారీకి అమ్మేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు నిగ్గు తేల్చారు ఆదిలాబాద్ పోలీసులు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి పథకం వేసుకున్నారని.. దీనిలో భాగంగానే తబరాక్ అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్గా కొనసాగుతూ మిగిలిన ఐదుగురు వ్యక్తులను దేశవ్యాప్తంగా బైకులపై పంపుతూ పాత సెల్ ఫోన్లు కొనుగోళ్లు చేయిస్తున్నాడని.. ఆ ఐదుగురు ఊరూర తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లు కొంటారు. పాడైన ఫోన్లు కొంటామంటూ.. స్టీల్ సామాన్లకు ప్లాస్టిక్ డబ్బాలకు పాత ఫోన్లు తీసుకుంటామంటూ పాత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాటరీలను సేకరిస్తున్నారని.. ఈ సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల ద్వారా తబరాక్, అతని అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు బ్యాంకు అధికారులమని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూ వివిధ రకాలుగా నమ్మిస్తూ మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ప్రజలకు ఓటీపీ పంపించి వాటి ద్వారా అమాయకుల బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులను మళ్లించుకుంటున్నారని.. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ఫోన్ల ద్వారా వేల మంది అమాయక ప్రజలను మోసగించాలని కుట్ర పన్నినట్లు ఎస్పీ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సంచరిస్తూ కొనుగోలు చేసిన 2125 ఫోన్లతో భారీ కుట్రకు ఫ్లాన్ వేశారని.. ఇప్పటికీ ఆ మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు అమాయక ప్రజల పేరుపై ఉండడంతో మోసాలు చేసినవారు దొరకకుండా యదేచ్చగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని.. పాత ఫోన్లే కదా అని గుర్తు తెలియని వ్యక్తులకు స్టీల్ పాత్రలకు ఇంటి అవసరాల కోసం అమ్మితే చిక్కుల్లో పడటం తప్పదని ఎస్పీ మహాజన్ హెచ్చరించారు.
ఆదిలాబాద్లో అరెస్ట్ అయిన నిందితులు బీహార్కు చెందిన గ్యాంగ్గా తెలిపారు ఎస్పీ మహాజన్. నిందితులను తబ్రక్ , మహ్మద్ మెర్జుల్, మహబూబ్, మహ్మదగ జమాల్, ఎండి ఉజిర్, అబ్దుల్లాగా తేల్చారు. వీరి వద్ద నుంచి దాదాపు 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ముఠా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు పది నుంచి 12 వేల వరకు మొబైల్ ఫోన్లను సేకరించి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ మహాజన్ తెలిపారు. బైకులపై తిరుగుతూ మీ ఊర్లలో మీ వాడలో పాత ఫోన్లు కొనుగోలు చేస్తామని ఎవరైనా వస్తే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు. పనికి రాని ఫోన్లే కదా అని అమ్మేసి సైబర్ నేరాలకు బలికావద్దని హెచ్చరించారు.