Hyderabad: ఉదయం వాకింగ్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఊహించని సీన్.. విగతజీవిగా ఇంటికి..
ఆయన ఉదయాన్నే వాకింగ్ చేసేందుకు రోడ్డుపైకి వెళ్లాడు. ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. తిరిగి విగతజీవిగా ఇంటికి చేరాడు. అసలేం జరిగింది తెలియాలంటే.. ఈ స్టోరీలో మీరూ తెలుసుకోవాల్సిందే. లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి మరి.. ఆ వివరాలు.

హైదరాబాద్ పోలీసు శాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ పోలీస్ ఉన్నతాధికారి దుర్మరణం చెందారు. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ హయత్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం వాకింగ్ కోసం వెళ్లిన ఆయన అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్-విజయవాడ హైవే లక్ష్మారెడ్డి పాలెం వద్ద ఈ ఘటన జరిగింది.
హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న బాబ్జీ లక్ష్మారెడ్డి పాలెం సమీపంలోని మైత్రీ కుటీర్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. శనివారం ఉదయం ఆయన నడక కోసం హైదరాబాద్-విజయవాడ హైవే దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన APSRTC బస్సు రోడ్డు దాటుతున్న బాబ్జీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, బాబ్జీ మృతితో పోలీస్ శాఖలోని ఆయన మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే ఆయనకు అడిషనల్ DCPగా ప్రమోషన్ రాగా.. ప్రస్తుతం రాచకొండ కమీషనరేట్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.