Bandi Sanjay: మా కెప్టెన్ మోదీ.. కాంగ్రెస్ కెప్టెన్ ఎవరు.. సూటిగా ప్రశ్నించిన భారతీయ జనతా పార్టీ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు బండి సంజయ్.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు బండి సంజయ్. బండి సంజయ్ నామినేషన్ తర్వాత కరీంనగర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. ఈ రెండు పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కులేదని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్లో బీజేపీ ఖాతా తెరిచిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రబాయి పటేల్ తెలిపారు. సూరత్ లోక్సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామన్న ఆయన, ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీజీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారని స్పష్టం చేశారు. మోదీని ఆశీర్వదించండి.. తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారన్నారు భూపేంద్రబాయి. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి, భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు గుజరాత్ సీఎం.
మా కెప్టెన్ మోదీ..కాంగ్రెస్ కెప్టెన్ ఎవరని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. తానూ లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి నాన్లోకల్, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తనను ఓడగొట్టడానికి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని మండిపడ్డారు. 12వేల కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు చేసిన తనకే ప్రజల మద్దతు ఉందన్నారు బండి సంజయ్. దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. మరోసారి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ కోసం అన్ని వర్గాల ప్రజలు మే 13న ఓటు వేయాలని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు కిషన్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..