Telangana: ప్రధాని RR ట్యాక్స్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్…
బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి. టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు సంచలన కామెంట్స్ చేశారాయన. బీసీల జనాభాను లెక్కించబోమని బీజేపీ చెబుతోందన్నారు. కులగణన చేయాలన్నది కాంగ్రెస్ వాదన అన్నారు. కులగణన చేస్తేనే రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. RR ట్యాక్స్ అంటూ మోదీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. తమ ప్రభుత్వం ఇప్పటివరకు అసలు కాంట్రాక్టులే ఇవ్వలేదన్నారు. దేశ ప్రధాని కనీస అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రధాని సోర్స్ ఏంటో అర్థం కావట్లేదన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన మోదీ, కేసీఆర్ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేసే స్థాయికి ఎలా వచ్చారని సూటిగా ప్రశ్నించారు రేవంత్రెడ్డి.
తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతీయాలని గుజరాత్ పెట్టుబడిదారులు కుట్రచేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను గుజరాత్కు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ కూడా గుజరాత్కు తీసుకుపోయారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని.. దుర్మార్గమైన ప్రయోగాలు చేయొద్దని మోదీ, అమిత్షాకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సీఎం.
మోదీ దగ్గర మంచి ఉంటే నేర్చుకుంటామన్నారు సీఎం రేవంత్రెడ్డి. మోదీతో సిద్ధాంతపరమైన వైరుధ్యమే తప్ప వ్యక్తిగత వైషమ్యం లేదన్నారు. మోదీ, కేసీఆర్ ప్రసంగాలు ఒకేలా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ నేతల ఉపన్యాసాలనే మోదీ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఇక పార్టీ ఆదేశాలతోనే తాను పినరయి విజయన్పై విమర్శలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..