Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై కేసు.. దాడి చేసి, సాక్ష్యాలను తారుమారు చేశారంటూ ఐటీ అధికారి ఫిర్యాదు..
మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు ముగిశాయి. హైదరాబాద్ ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్నాటక నుంచి వచ్చిన 400 మంది.. 65 బృందాలుగా విడిపోయి రెండురోజులపాటు సోదాలు నిర్వహించారు.

IT Raids On Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు ముగిశాయి. హైదరాబాద్ ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్నాటక నుంచి వచ్చిన 400 మంది.. 65 బృందాలుగా విడిపోయి రెండురోజులపాటు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 10.50 కోట్లు సీజ్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐటీ శాఖ తనిఖీల నుంచి తాఖీదులదాకా వెళ్లింది. ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. మల్లారెడ్డి.. ఆస్పత్రికి పరుగులు పెట్టి ఐటీ అధికారి రత్నాకర్ని వెంటపెట్టుకొచ్చారు. అదే సమయంలో ల్యాప్టాప్, ఫోన్లు లాక్కున్నారన్నది ఐటీ అధికారుల ఆరోపణ. కాసేపటికి ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చినా దాన్ని ఐటీ సిబ్బంది తీసుకోలేదు. పైగా.. అసలు అది తమ ల్యాప్టాప్ కాదు అని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఆ ల్యాప్టాప్ బోయిన్పల్లి పోలీస్స్టేషన్లోనే ఉంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
మంత్రి మల్లారెడ్డిపై ఐదు అంశాల్లో ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఫిర్యాదు చేశారు.
- సివిల్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడం
- సాక్ష్యాలు, ఆధారాలను ధ్వంసం చెయ్యడం
- తప్పుడు సమాచారం ఇవ్వడం
- అసభ్యపదజాలంతో దూషించడం
- ల్యాప్టాప్, ఫోన్లను మల్లారెడ్డి దొంగిలించినట్లు ఆరోపణలు
- ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వంద కోట్లు దొరికినట్లు నకిలీ డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. తనపైనే బలవంతం చేస్తే హాస్పిటల్లో ఉన్న తన కుమారుడి పరిస్థితి ఏంటంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు.అప్పటికే కొడుకుతో సంతకాలు తీసుకున్నారని మంత్రి ఆరోపిస్తున్నారు. వందకోట్ల అక్రమ డొనేషన్ల టాపిక్పై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు డాక్యుమెంట్లు తయారు చేశారన్నారు. ఏ విధంగా చూసినా అంతా సక్రమమే అన్నారు మల్లారెడ్డి.
ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు, ఐటీ అధికారి రత్నాకర్పై ఫిర్యాదు చేశారు. రత్నాకర్ చెయ్యి పట్టుకుని పీఎస్కి తీసుకెళ్లారు.ఐటీ అధికారులపై మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే…విచారణకు సహకరించకుండా తమను దూషిస్తున్నారని మల్లారెడ్డిపై కమిషనర్కి ఐటీ అధికారులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
