AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మరో వారంలో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోనన్నభయంతో తాజాగా మరో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో తల్లిదండ్రులులేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం, పొడిచెన్‌పల్లి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాల ప్రకారం..

పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
10th Class Student Committed Suicide In Medak
Srilakshmi C
|

Updated on: Apr 25, 2026 | 10:18 AM

Share

మెదక్, ఏప్రిల్ 25: కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానికంగా జెడ్.పి.హెచ్ స్కూల్‌లో పదో తరగతి చదువుతుంది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరైంది. అయితే పరీక్షలు రాసినప్పటి నుంచి సాయిప్రియకు ఫెయిల్‌ అవుతానేమోనన్న భయం పట్టుకుంది. పరీక్షల అనంతరం ఇంట్లో దిగులుగా ఉండటాన్ని గమనించిన తల్లి లత కుమార్తెను ప్రశ్నించింది. తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని ఫెయిల్ అవుతానని భయం వేస్తుంది అని తెలిపింది. ఫెయిల్‌ అయినా పర్వాలేదని, భయపడొద్దని తల్లి ధైర్యం చెప్పింది. అయితే పదో తరగతి ఫలితాలు ప్రకటించే సమయం సమీపిస్తుండటంతో సాయిప్రియలో భయం మరికాస్త ఎక్కువవసాగింది. దీంతో శుక్రవారం ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సాయిప్రియ సోదరుడు గమనించి తల్లికి తెలిపాడు. ఆమె పరుగున ఇంటికి చేరుకోగా ఉరికొయ్యకు కూతురు వేలాడుతూ కనిపించడంతో కుప్పకూలి పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మృతురాలి తల్లి లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫెయిల్‌ భయం వద్దు.. ఫలితం ఏదైనా అంగీకరించు

పదో తరగతి పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో వెలువడతాయని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఫెయిల్‌ భయంతో విద్యార్ధులు ముందుగానే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఫెయిల్‌ అయితే ఏమవుతుంది? మహా అయితే 2 లేదా 3 సబ్జెక్టులు పోతాయ్‌. అంతేకదా..! మళ్లీ చదివి సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తే పాస్‌ అవుతారు. ఈ మాత్రానికే అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చిన వారే అవుతారు. ఏ పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుకు సాగడమే అసలైన గెలుపు. ఏమంటారు.. నిజమేనా?

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us