ప్రాణం తీస్తున్న ఆన్లైన్ గేమ్స్.. క్లిక్‌కి చెక్ పెట్టాల్సిందే!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి మనుగడలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జస్ట్ ఒక్క క్లిక్ తోనే అన్ని రకాల సదుపాయాలు అందేలా ఎన్నో రకాల యాప్స్ పుట్టుకొచ్చాయి. తద్వారా అటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఎన్నో గేమింగ్ యాప్స్ కూడా ఆన్లైన్ లో చాలా ఉండటంతో యువత విరివిగా వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. ఇకపోతే ఈ గేమింగ్ అప్లికేషన్స్ లో కొన్ని మంచిని ప్రబోదించేవి ఉంటే మరికొన్ని యువతను చెడు మార్గంలో వెళ్ళేలా ప్రేరేపిస్తున్నాయి. […]

ప్రాణం తీస్తున్న ఆన్లైన్ గేమ్స్.. క్లిక్‌కి చెక్ పెట్టాల్సిందే!
Follow us

|

Updated on: Sep 18, 2019 | 4:34 PM

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి మనుగడలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జస్ట్ ఒక్క క్లిక్ తోనే అన్ని రకాల సదుపాయాలు అందేలా ఎన్నో రకాల యాప్స్ పుట్టుకొచ్చాయి. తద్వారా అటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఎన్నో గేమింగ్ యాప్స్ కూడా ఆన్లైన్ లో చాలా ఉండటంతో యువత విరివిగా వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. ఇకపోతే ఈ గేమింగ్ అప్లికేషన్స్ లో కొన్ని మంచిని ప్రబోదించేవి ఉంటే మరికొన్ని యువతను చెడు మార్గంలో వెళ్ళేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ యాప్స్ లో ముఖ్యంగా మూడు క్రిమినల్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. అవే బ్లూ వేల్, మోమో, పబ్ జీ..

బ్లూ వేల్:

ఛాలెంజ్ పేరుతో పిల్లల్ని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది బ్లూ వేల్ సూసైడ్ గేమ్. ఈ గేమ్ ఛాలెంజ్ ముఖ్యంగా టాస్కులు ఆధారంగా ఉంటుంది. ఈ ఆట ఆడే వ్యక్తీ మొత్తం 50 టాస్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆఖరిదైన చివరి టాస్క్.. ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. కాగా ఈ గేమ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన యువత ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు.

బ్లూ వేల్ ఛాలెంజ్ రూపకల్పన…

ఈ భయంకరమైన ఛాలెంజ్ గేమ్ రష్యాలో పురుడుపోసుకుంది. 2013లో రష్యాకు చెందిన ఫిలిప్ బుడికిన్ అనే సౌండ్ ఇంజనీర్ దీనిని క్రియేట్ చేయగా.. ఈ గేమ్ కారణంగా అతనికి 2017లో మూడేళ్ళ జైలు శిక్ష కూడా పడింది. ఇక ఫిలిప్ ఈ గేమ్ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘సమాజం పట్ల బాధ్యత లేకపోవడం.. హనీ చేసే తత్వం కలిగిన వారెవ్వరూ ఈ లోకంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ సృష్టించానని చెప్పాడు.

ఈ గేమ్‌ను సృష్టించేటప్పుడు ఫిలిప్ వయసు 22 సంవత్సరాలే.. కానీ దీన్ని డిజైన్ చేసిన పద్దతిని చూస్తుంటే అతడు హ్యూమన్ సైకాలజీని పూర్తిగా అర్ధం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఛాలెంజ్ లో భాగంగా ప్రారంభ టాస్కులు వల్ల ఎటువంటి ప్రమాదం లేకపోయినా.. క్రమేపి ఆ టాస్కులు చివరికి చేరుకునే సరికి బాధితుడిని ఆత్మహత్యకు ఉసిగొలిపే విధంగా ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు మొదటి టాస్క్ ఉదయం 4.20 గంటలకు మేల్కొనాలని ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని టాస్కులు ప్రారంభమవుతాయి. ఈ టాస్కులను ఒక్కొక్కటిగా స్వీకరిస్తూ పోతుంటే.. అటు మనసు, ఇటు శరీరంపై ప్రభావం చూపిస్తాయని.. అంతేకాకుండా ఛాలెంజ్ లోని మ్యూజిక్ అండ్ విజువల్స్ కూడా బాధితుడిని చాలా బాధపెడతాయని సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ప్రస్తుతం ఈ యాప్ భారత్‌లో నిషేధానికి గురైంది.

మోమో:

మోమో… బ్లూ వేల్ తరహాలోనే సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపించిన మరో ప్రాణాంతకమైన గేమ్. ఈ డెడ్లీ గేమ్ బారిన పడి ఇప్పటికే చాలామంది మృతి చెందారు. అప్పట్లో ఈ గేమ్ యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో బాగా విస్తృతమైంది. ప్రత్యేక లింక్‌ల ద్వారా వేగంగా వ్యాపించిన మోమో ఛాలెంజ్‌ భారత్‌లోనూ అడుగుపెట్టింది.

మోమో గేమ్‌లో భాగంగా ‘బ్లూవేల్‌’ తరహాలో కొన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్‌ ‘మోమో’ ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న ఓ గుర్తు తెలియని నంబర్‌ నుంచి వస్తుంది. వారిచ్చిన పనిని పూర్తి చేయాలని ఆదేశాలు అందుతాయి. ఆ పని పూర్తి చేసి మోమో గేమ్‌లో భాగంగా సోషల్ మీడియాలో దాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన హారర్ వీడియోలు పంపడం, బెదిరింపులు రావడం మొదలవుతాయి.

మోమో మూలాలు:

భయంకరమైన శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఓ విచిత్ర ఆకారం పేరే ‘మోమో’. జపాన్‌కు చెందిన ఓ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ఈ ఆకారాన్ని రూపొందించింది. అయితే.. ఆ కంపెనీకీ ఈ గేమ్‌కు ఎలాంటి సంబంధం లేదు. కొంత మంది హ్యాకర్లు ఈ ఆకారాన్ని వాడుకొని మోమో ఛాలెంజ్ రూపొందించినట్లు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ వేదికగా ఈ గేమ్‌ అప్పట్లో వేగంగా వ్యాప్తి చెందింది. అర్జెంటీనాలో ఓ చిన్నారి ఈ ప్రాణాంతక గేమ్‌కు బలవ్వడంతో దీని గురించి చర్చ మొదలైంది. ఇకపోతే ఈ గేమ్ ను ఎవరు ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.? దీని వెనుక ఎవరున్నారు.? అనే వివరాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలే. అయితే ఈ గేమ్ మాత్రం ఎక్కువగా టీనేజ్ యువతీయువకులనే టార్గెట్ చేస్తుంది. కాగా కొన్నాళ్ళకు ఈ యాప్‌ భారత్‌లో కనుమరుగైంది.

పబ్ జీ:

పైన చెప్పుకున్న రెండు గేమ్స్ కంటే.. ఈ గేమ్ అంత ప్రాణాంతకమైనది కాదు. ఈ పబ్ జీ గురించి ఒకసారి పరిశీలిస్తే.. ఒక ప్రదేశంలో 100 మంది పారాచ్యుట్స్ తో దిగుతారు. గేమ్ ను ఒకరే ఆడితే.. మిగిలిన 99 మందిని హతమార్చి.. చివరికి ‘చికెన్ డిన్నర్’ కొట్టాలి. అదే గ్రూప్ అయితే వారి సభ్యులు నలుగురు మిగిలిన 96 మందిని దాటుకుని.. ‘విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్’ టైటిల్ గెలవాలి. చూడడానికి మాములు గేమ్ గా ఉన్నా.. ఈ ఆట బారిన పడి ఇప్పటికే చాలామంది నరహంతకులుగా మారారు. కొందరైతే బానిసలుగా మారి.. ఆటకు దూరమైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇక రీసెంట్ గా బెంగుళూరులో జరిగిన పబ్ జీ ఉదంతం గురించి మాట్లాడితే.. ఈ గేమ్ యువత నరనరాల్లోకి ఎంతలా చొచ్చుకుపోయిందో తెలుస్తుంది.

పబ్ జీ ఆటను సమయం అనేది చూడకుండా ఆడుతున్న ఓ వ్యక్తి.. ఆ గేమ్ కు దూరం చేశారనే అక్కసుతో తన తండ్రిని చంపేసి.. ముక్కలుగా నరికి తల, మొండం వేరు చేసిన ఘటన పెద్ద సంచలనమే అయింది. నిందితుడు చుట్టూ ప్రక్కల వాళ్ళ ఇళ్లకు తరచూ వెళ్తూ.. ‘రక్తం కావాలి.. రక్తం కావాలి’ అని పీడించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు పబ్ జీ గేమ్ ను నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతలా ప్రయత్నించినా జరగట్లేదు. దీని వల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కరడు కట్టిన హంతకులుగా మారుతున్నారు.

ఇటువంటి గేమ్స్‌కు యువత ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిదని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఈ గేమ్స్ మానసిక క్షోభను కలిగిస్తాయని.. అందువల్ల సూసైడ్ అట్టెంప్స్ ఎక్కువగా జరుగుతాయని వారి అభిప్రాయం.