Team India: టీమిండియా రెండో టీ20 జట్టు సిద్ధం.. వైభవ్, పాటిదార్లకు చోటు.. కెప్టెన్గా ఎవరంటే?
Team India 2nd T20 Squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రెండు వేర్వేరు టీ20 జట్లను రూపొందించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ ఆసక్తికరమైన భారత రెండో జట్టును ప్రకటించారు. ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఈ జట్టులో యువ రక్తం ఉరకలేస్తుండగా, ప్రపంచ కప్ స్టార్లకు చోటు దక్కకపోవడం గమనార్హం.

Team India 2nd T20 Squad: రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్. అతని దూకుడు స్వభావం, నిర్భయమైన బ్యాటింగ్ శైలి ఇయాన్ బిషప్ను అమితంగా ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేయడానికి వైభవ్ సర్వసన్నద్ధంగా ఉన్నాడని బిషప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్తో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తే అది ప్రత్యర్థి జట్లకు సవాలుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. గిల్ సాంకేతిక నైపుణ్యం, వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ జట్టను పటిష్టం చేస్తాయని ఆయన విశ్లేషించారు.
ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ కూర్పు..
బిషప్ తన జట్టులో ముగ్గురు ఓపెనింగ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. గిల్, వైభవ్ తో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్కు చోటు కల్పించారు. ఎడమ, కుడి చేతి వాటం బ్యాటర్ల కలయిక జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని ఆయన నమ్మకం. మిడిల్ ఓవర్లలో అనుభవజ్ఞుడైన శ్రేయస్ అయ్యర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున నిలకడగా రాణిస్తున్న రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్లను కూడా జట్టులోకి తీసుకున్నారు. వికెట్ కీపర్ స్థానంలో ధ్రువ్ జురెల్ను ఎంపిక చేయగా, ఆల్రౌండర్గా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు.
వెటరన్ ఆటగాళ్ల పునరాగమనం..
బౌలింగ్ విభాగంలో బిషప్ అనుభవానికి పెద్దపీట వేశారు. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్ వంటి వెటరన్ ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. భువనేశ్వర్ కొత్త బంతితో ఇప్పటికీ ప్రమాదకరంగా మారగలడని, చహల్ తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీయగలడని ఆయన స్పష్టం చేశారు. స్పిన్ విభాగంలో చహల్తో పాటు కృనాల్ పాండ్యాకు చోటు దక్కింది.
ప్రపంచ కప్ విజేతలకు నో ఛాన్స్..
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడిని కూడా బిషప్ తన ప్రత్యామ్నాయ జట్టులో చేర్చలేదు. ఐపీఎల్ 2026లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ ఆటగాళ్లతోనే ఈ జట్టును రూపొందించారు. ఐర్లాండ్ పర్యటన వంటి సిరీస్లకు ఈ కొత్త జోడిని పరీక్షించడానికి ఇదే సరైన సమయమని బిషప్ సూచించారు.
బిషప్ ఎంపిక చేసిన భారత ప్రత్యామ్నాయ జట్టు: శుభ్మన్ గిల్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
