AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs DC IPL 2026 : జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం.. ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం

RR vs DC IPL 2026 : జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. రియాన్ పరాగ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించగా, ధ్రువ్ జురెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. చివర్లో డోనోవన్ ఫెరీరా సిక్సర్ల వర్షం కురిపించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

RR vs DC IPL 2026 : జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం.. ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
Rr Vs Dc Ipl 2026
Rakesh
| Edited By: |

Updated on: May 01, 2026 | 9:31 PM

Share

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదట తడబడినా, కెప్టెన్ రియాన్ పరాగ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీ గెలవాలంటే 120 బంతుల్లో 226 పరుగులు చేయాల్సి ఉంది. అంటే ఓవర్‌కు సగటున 11.3 పరుగులు చేయాలి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 6 పరుగులకే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా కైల్ జేమీసన్ వేసిన యార్కర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

రియాన్ పరాగ్ కెప్టెన్ అయిన తర్వాత తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న పరాగ్, మైదానం నలుమూలలా షాట్లు ఆడి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ధ్రువ్ జురెల్ కూడా 30 బంతుల్లో 42 పరుగులు చేసి అతనికి మంచి సహకారం అందించాడు. వీరిద్దరి జోరుకు అక్షర్ పటేల్ బ్రేక్ వేసినప్పటికీ, అప్పటికే రాజస్థాన్ పటిష్ట స్థితికి చేరుకుంది. చివర్లో డోనోవన్ ఫెరీరా సిక్సర్లతో విరుచుకుపడటంతో రాజస్థాన్ స్కోరు 225 మార్కును దాటింది.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరంభంలోనే వికెట్ తీసి మంచి ఆశలు రేకెత్తించాడు. కైల్ జేమీసన్ కూడా వైభవ్ వికెట్ తీసి రాజస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పరుగులు కట్టడి చేయడంలో కొంతవరకు సఫలమైనా, డెత్ ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లను ఆపలేకపోయారు. ముఖ్యంగా రియాన్ పరాగ్ క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. ఇప్పుడు ఢిల్లీ బ్యాటర్ల మీద భారీ భారం పడింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం. కానీ 226 పరుగుల లక్ష్యం అంటే చిన్న విషయం కాదు. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా వంటి ఆటగాళ్లు మెరుపులు మెరిపిస్తేనే ఢిల్లీకి గెలుపు అవకాశాలు ఉంటాయి. మరోవైపు రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో సిద్ధంగా ఉన్నాడు. నేటి మ్యాచ్ ఫలితం రాజస్థాన్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి తీసుకెళ్తుందా లేక ఢిల్లీ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇస్తుందా అన్నది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us