Smriti Mandhana Marriage: పెళ్లిని వాయిదా వేసింది స్మృతి మంధాన కాదంట.. ఎవరో తెలుసా?
Palash Muchhal, Smriti Mandhana's Wedding Postponed: టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వివాహం తన తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వివాహం రద్దు అయిన తర్వాత, కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తల్లి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది.

Smriti Mandhana’s Wedding Postponed: స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీతకారుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడినప్పటి నుంచి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట్లో, స్మృతి మంధాన తండ్రి ఆరోగ్యం పెళ్లి రోజున క్షీణించిందని, ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత, తన తండ్రి ఆరోగ్యం కారణంగా స్మృతి మంధాన వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.
ఇప్పుడు, ఈ కథలో కొత్త మలుపు వచ్చింది. సంగీతకారుడు పలాష్ ముచ్చల్ తల్లి వివాహాన్ని వాయిదా వేసింది స్మృతి కాదని, తన కొడుకు అని వెల్లడించి షాకిచ్చింది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాన్ని ఆమె వివరించింది. పలాష్ తల్లి కూడా పలాష్ స్మృతి కంటే క్రికెటర్ తండ్రికి దగ్గరగా ఉండేవాడని పేర్కొంది.
పెళ్లి వాయిదా వేసింది పలాష్, స్మృతి కాదు..
ఒక ఇంటర్వ్యూలో, పలాష్ తల్లి అమిత ముచ్చల్, తన కొడుకు, స్మృతి తండ్రి చాలా సన్నిహితంగా ఉండేవారని వివరించింది. అందువల్ల, స్మృతి తండ్రిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే, పలాష్ వివాహ ఆచారాలు, ఇతర ఆచారాలను ఆపాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది.
పలాష్ తల్లి మాట్లాడుతూ, “పలాష్ మామ (స్మృతి తండ్రి) తో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు. స్మృతి కంటే చాలా క్లోజ్ గా ఉండేవాడు. అతని ఆరోగ్యం క్షీణించినప్పుడు, మామ కోలుకునే వరకు పెళ్లిని వాయిదా వేయాలని పలాష్ స్మృతి కంటే ముందే నిర్ణయించుకున్నాడు” అంటూ తెలిపింది.
పలాష్ సోదరి ఏమి చెప్పిందంటే?
స్మృతి మంధానతో తన సోదరుడి వివాహం వాయిదా పడిన తర్వాత, ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ తన మౌనాన్ని వీడి ఇన్స్టాగ్రామ్లో పూర్తి నిజాన్ని పంచుకుంది. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా, స్మృతి, పలాష్ వివాహం వాయిదా పడినట్లు చెప్పుకొచ్చింది. ఈ సున్నితమైన సమయంలో ప్రతి ఒక్కరూ కుటుంబాల గోప్యతను గౌరవించాలని మేము అభ్యర్థిస్తున్నాం అంటూ రాసుకొచ్చింది.




