గిల్ తర్వాత మరో టీమిండియా ఓపెనర్ డబుల్ ధమకా.. 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 208 రన్స్.. బౌలర్లకు చుక్కలు
రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం కేరళతో ప్రారంభమైన కీలక మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం ఓపెనర్ అద్భుత డబుల్ సెంచరీ సాధించాడు.

రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం కేరళతో ప్రారంభమైన కీలక మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం ఓపెనర్ అద్భుత డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 360 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. KCA క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ డబుల్ సెంచరీతో మూడోరోజు మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీస్కోరు సాధించింది కర్ణాటక. నికిన్ జోస్ (54), శ్రేయస్ గోపాల్ (48) షరత్ బీఆర్ (47 బ్యాటింగ్) మయాంక్కు సహకారం అందించారు. అంతుకుముందు బ్యాటింగ్ చేసిన కేరళ 342 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబి 141 పరుగులతో మెరవగా, జల్ సక్సేనా 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కర్ణాటక జట్టు 68 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా మయాంక్ అగర్వాల్ గత 9 నెలలుగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. మార్చిలో శ్రీలంకతో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మయాంక్కు జట్టులో అవకాశం రాలేదు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లోనూ అతనికి చోటు దక్కలేదు.
అయితే రంజీ ట్రోఫీలో తన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రంజీ ట్రోఫీ సీజన్లో ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో 72.8 సగటుతో 583 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్కు ఒకరోజు ముందు టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అతను 208 పరుగులతో చెలరేగాడు. ఇది జరిగిన 24 గంటల్లోపే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా డబుల్ సెంచరీ సాధించడం విశేషం. శుభ్మన్ లాగే మయాంక్ కూడా 208 పరుగుల వద్దనే ఔటవ్వడం యాదృచ్ఛికం.




How about this for ????????????@mayankcricket????????????? #SunrisersHyderabad #OrangeArmy #RanjiTrophy #MayankAgarwal pic.twitter.com/Qw97MeWa2k
— Orange Army (@srhfans0fficial) January 19, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
