Team India: టీ20ల నుంచి ఆ నలుగురు ఔట్..? బీసీసీఐ వేటుతో ఇక రీఎంట్రీ కష్టమే..!
Indian Cricket Team: క్రికెట్లో మార్పులు సహజం. ఒక తరం ముగిసి మరో తరం రావడం ఖాయం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు టీమిండియా యాజమాన్యం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు సీనియర్ ఆటగాళ్లకు చేదు అనుభవమే అయినప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి అనిపిస్తోంది. దేశానికి ఎన్నో సేవలందించిన ఈ నలుగురు దిగ్గజాలకు టీ20ల్లో ఘనమైన వీడ్కోలు లభించకపోవడం మాత్రం అభిమానులను కాస్త కలచివేసే విషయమే.

Team India: భారత టీ20 క్రికెట్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రపంచకప్ అందించిన కెప్టెన్తో సహా నలుగురు సీనియర్ దిగ్గజాల టీ20 కెరీర్కు దాదాపు తెరపడినట్లు తెలుస్తోంది. ఫామ్ లేమి, యువ ఆటగాళ్ల పోటీ కారణంగా వీరి పునరాగమనం ఇక దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
సూర్యకుమార్ యాదవ్: కెప్టెన్సీ పోయింది.. జట్టులో చోటూ లేదు..!
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు అద్భుతమైన టైటిల్ విజయాన్ని అందించిన నాయకుడు సూర్యకుమార్ యాదవ్. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వరల్డ్ కప్ గెలిచిన కొద్ది రోజులకే సూర్యకు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కకపోవడమే కాకుండా, కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించారు.
కాగా, అజిత్ అగార్కర్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ ఫామ్ కూడా ఆందోళనకరంగా ఉంది. జట్టులో ప్రత్యామ్నాయంగా ఎంతోమంది యువ ఆటగాళ్లు దూసుకొస్తుండటంతో, మిస్టర్ 360 డిగ్రీల ఆటగాడి టీ20 కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిషభ్ పంత్: యువ వికెట్ కీపర్ల దూకుడుతో దూరం..!
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కథ కూడా టీ20ల్లో ముగింపు దశకు చేరినట్లు కనిపిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో బలమైన ప్రత్యామ్నాయాలు సిద్ధమయ్యాయి. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ వీరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
మరోవైపు రిషభ్ పంత్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 2024 శ్రీలంక పర్యటన తర్వాత అతడికి టీ20 జట్టులో మళ్లీ అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ పూర్తిగా యువ కీపర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో పంత్ పునరాగమనంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
భువనేశ్వర్ కుమార్: ఐపీఎల్లో మెరిసినా దక్కని పిలుపు..!
భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయిందనే చెప్పాలి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఏకంగా 28 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసినప్పటికీ సెలెక్టర్లు అతడిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భువీని కాదని యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు అవకాశం ఇచ్చారు. దేశవాళీ, ఐపీఎల్ వేదికలపై ఎంత రాణించినా సెలెక్టర్ల చూపు మాత్రం భువీ వైపు వెళ్లడం లేదు. దీనిని బట్టి చూస్తే పొట్టి ఫార్మాట్లో ఈ సీనియర్ బౌలర్ ప్రస్థానం ముగిసిన అధ్యాయమేనని స్పష్టమవుతోంది.
కేఎల్ రాహుల్: నాలుగేళ్లుగా నిరీక్షణ.. ఇక లాంఛనమే..!
టెస్టులు, వన్డేల్లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ను టీ20ల్లో మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. గత నాలుగేళ్లుగా అతడికి ఈ ఫార్మాట్లో చోటు దక్కలేదు. ఐపీఎల్లో వరుసగా 600కు పైగా పరుగులు చేస్తూ, 174.41 స్ట్రైక్ రేట్తో మెరిసినప్పటికీ సెలెక్టర్ల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు.
ప్రస్తుతం జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడైన రాహుల్ను మళ్లీ టీ20ల్లో చూడటం అభిమానులకు దాదాపు అసాధ్యంగానే మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




