బుమ్రా, సూర్యకుమార్లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక పోరులో ఘోర పరాజయం పాలైన తర్వాత, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కఠిన నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనపై నీలినీడలు ముసురుకోవడంతో జట్టులో మార్పులు ఖాయమని కెప్టెన్ పరోక్షంగా సూచించారు.

వాంఖడే స్టేడియంలో జరిగిన 33వ మ్యాచ్లో చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఘోరంగా విఫలమైంది. కేవలం 104 పరుగులకే కుప్పకూలి 103 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్లలో ఇది ఐదో ఓటమి. దీనివల్ల ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు హార్దిక్ పాండ్యా సమూల మార్పులు చేయాలని భావిస్తున్నాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు..
మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో హార్దిక్ మాట్లాడుతూ జట్టు కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో మార్పులు ఉంటాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “మేం తిరిగి వెళ్లి గతాన్ని సమీక్షించుకోవాలి. భవిష్యత్తులో ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మాకు కొన్ని రోజుల సమయం ఉంది, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటాం” అని పేర్కొన్నాడు. ఏ ఒక్కరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, సీనియర్ ఆటగాళ్ల స్థానాలకు ముప్పు పొంచి ఉందనే సంకేతాలిచ్చాడు.
ఫామ్ కోల్పోయిన స్టార్ ఆటగాళ్లు..
భారత జట్టు ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా, ఈ ఐపీఎల్ సీజన్లో తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఏడు ఇన్నింగ్స్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి, భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మరోవైపు, ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ సైతం బ్యాటింగ్లో తడబడుతున్నాడు. ఏడు మ్యాచ్ల్లో కేవలం 156 పరుగులు మాత్రమే చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వీరిద్దరి వైఫల్యం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది.
ముంబై ముందున్న కఠిన సవాళ్లు..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్లలో కనీసం ఆరింటిలో విజయం సాధించాల్సి ఉంది. రన్ రేట్ కూడా ప్రతికూలంగా ఉండటం జట్టుకు మరో ఆందోళనకర అంశం. ఏప్రిల్ 29న సన్రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే తదుపరి మ్యాచ్ ముంబైకి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ మ్యాచ్లో కొత్త వ్యూహాలతో, మార్పులు చేసిన జట్టుతో బరిలోకి దిగాలని యాజమాన్యం యోచిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
