ఐపీఎల్ జెమ్స్ కాదు.. మాకు కావాల్సింది దేశవాళీ తోపులు.. గంభీర్, అగార్కర్ స్కెచ్ అదుర్స్..!
India vs Afghanistan Test 2026: అఫ్గానిస్థాన్తో జరగబోయే కీలకమైన ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన సరికొత్త టీమిండియాను ప్రకటించింది. యువ సంచలనం శుభ్మన్ గిల్కు సెలెక్టర్లు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ, వికెట్ల వేట సాగించిన ఇద్దరు యువ ఆటగాళ్లకు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.

Gurnoor Brar, Harsh Dubey Selection: భారత క్రికెట్లో భవిష్యత్తు సూపర్ స్టార్గా దూసుకుపోతున్న శుభ్మన్ గిల్పై సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగర్కార్ మరోసారి గట్టి నమ్మకాన్ని ఉంచాడు. సీనియర్ల గైర్హాజరీలో గిల్ను టెస్టు జట్టు కెప్టెన్గా నియమించాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో, అలాగే వెస్టిండీస్తో జరిగిన సిరీస్లలో జట్టును ముందుండి నడిపించిన అనుభవం గిల్కు ఉంది. ఒత్తిడిని అధిగమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేసే గిల్.. ఈ మ్యాచ్లోనూ భారత్ను విజయతీరాలకు చేరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. రిషభ్ పంత్ స్థానంలో రాహుల్కు ఈ బాధ్యతలు దక్కడం విశేషం.
దేశవాళీ హీరోలు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు బంపర్ ఆఫర్..
ఈ జట్టు ప్రకటనలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఇద్దరు యువ ఆటగాళ్ల ఎంపిక. రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున సంచలన ప్రదర్శన చేసిన ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తొలిసారి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కేవలం 7 మ్యాచ్ల్లోనే 26 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక విదర్భకు చెందిన ఎడమచేతి వాటం స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దూబే సైతం జట్టులోకి దూసుకొచ్చాడు. రంజీ సీజన్లో ఏకంగా 69 వికెట్లు పడగొట్టి, విదర్భ జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన హర్ష్ దూబేకు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది.
స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి.. గాయంతో పేసర్ దూరం..
రానున్న బిజీ షెడ్యూల్, ఆటగాళ్ల శ్రమను పరిగణనలోకి తీసుకుని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ మ్యాచ్ నుంచి సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. అలాగే, గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న బౌలర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్ సీజన్కు కూడా దూరమైన ఆకాశ్ దీప్, ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో అతని స్థానంలో ఇతర బౌలర్లకు అవకాశం కల్పించారు.
అఫ్గానిస్థాన్తో తలపడే భారత టెస్టు జట్టు ఇదే:
టీమిండియా స్క్వాడ్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).
జూన్ 6న జరగబోయే ఈ ఏకైక టెస్టు మ్యాచ్ యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకోవడానికి ఒక సువర్ణావకాశం. అనుభవజ్ఞులైన రాహుల్, పంత్ మార్గదర్శకత్వంలో కెప్టెన్ గిల్ ఈ యువ బలగాన్ని ఎలా నడిపిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్ను చిత్తు చేసి భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయాలని క్రికెట్ ప్రియులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




