మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి అతడిని ఆడిస్తారా.. గంభీర్, బీసీసీఐలపై మాజీ ప్లేయర్ ఫైరింగ్..!
Mohammed Siraj Injury: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేస్ దళాన్ని నడిపిస్తున్న మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్పై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. అతను గాయంతోనే బరిలోకి దిగాడంటూ కర్ణాటక మాజీ పేసర్ దొడ్డ గణేశ్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంట్, బీసీసీఐ వైద్య బృందం పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Mohammed Siraj Injury: బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో లంక పర్యటనలో పేస్ బాధ్యతలను సిరాజ్ తన భుజాలపై వేసుకున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ గంభీర్ కేవలం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. అయితే మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్ వేగం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదో రోజు తొలి సెషన్లో అతను కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతని అత్యధిక వేగం 132.8 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ మొత్తం మీద సగటున 126 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసిరాడు. దీన్ని బట్టి అతను వంద శాతం ఫిట్గా లేడని, ఏదో నొప్పితో బాధపడుతున్నాడని దొడ్డ గణేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మామూలుగా అయితే సిరాజ్ ఇంత నెమ్మదిగా బౌలింగ్ చేయడని ఆయన గుర్తుచేశారు.
బీసీసీఐ పర్యవేక్షణపై ప్రశ్నలు..
సిరాజ్ ఫిట్నెస్పై వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), బీసీసీఐ మెడికల్ టీమ్ పనితీరును బోనులో నిలబెడుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు సిరాజ్ చాలా రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే గడిపాడు. అప్పుడే అతని గాయం గురించి వైద్యులకు తెలియలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ బౌలర్ కెరీర్ను ప్రమాదంలో పడేసేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండో టెస్టులో బెంచ్కే పరిమితమా..?
Is Siraj carrying a niggle? This isn’t the pace he usually bowls #SLvIND
— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 19, 2026
గాలే టెస్టులో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఏకంగా 116.4 ఓవర్లు ఫీల్డింగ్ చేసినా, శ్రీలంక పేసర్లు వేసింది కేవలం 25 శాతం ఓవర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టులో సిరాజ్కు కచ్చితంగా విశ్రాంతినిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో న్యూజిలాండ్తో కీలకమైన టెస్టు సిరీస్ జరగనున్న దృష్ట్యా, అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత టీమిండియా మేనేజ్మెంట్పై ఎంతైనా ఉంది.
జట్టులో కీలక బౌలర్గా ఉన్న సిరాజ్కు చిన్న గాయమైనా అది టీమిండియా విజయవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. రాబోయే మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్లోడ్ మేనేజ్మెంట్పై గంభీర్ సేన మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




