Maha Pushpa Yagam:పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపూల మహాయాగం ప్రారంభం.. ఆనలైన్‌లో టికెట్లు లభ్యం

Maha Pushpa Yagam: తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం కనకాంబరం సహిత..

Maha Pushpa Yagam:పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపూల మహాయాగం ప్రారంభం.. ఆనలైన్‌లో టికెట్లు లభ్యం
Padmavati
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 16, 2021 | 5:36 PM

Maha Pushpa Yagam: తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం కనకాంబరం సహిత కోటి మల్లెపుష్ప మ‌హాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వ‌రకు ఆన్ లైన్ వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవ‌తార‌మైన శ్రీ పద్మావతి అమ్మవారి కోరుతూ టీటీడీ ఈ మహాయాగం నిర్వహిస్తోంది.

ఉద‌యం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి, మూల వార్లకు అభిషేకం నిర్వహించారు. అనంత‌రం సహస్రనామార్చన నిత్యార్చన యధావిధిగా నిర్వహించారు. ఉద‌యం 8.30 గంట‌లకు ఆల‌యంలోని శ్రీ కృష్ణాష్టమి ముఖ మండ‌పంలో అమ్మవారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా సంక‌ల్పం, కుంభ అవాహ‌న‌, అగ్ని ప్రతిష్ట, చ‌తుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవ‌ర్తి, హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం కోటి అర్చనన‌, మ‌హా నివేద‌న‌, ల‌ఘు పూర్ణాహుతి నిర్వహించ‌నున్నారు.

టిటిడి పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు పర్యవేక్షణలో ప్రతిరోజూ ఉద‌యం, సాయంత్రం వేళల్లో 400 కిలోల పుష్పాల‌తో అమ్మవారిని అర్చించనున్నారు. ఒక్కపూట‌కు 40 కిలోల క‌న‌కాంబ‌రాలు, 120 కిలోల మ‌ల్లెపూలు, 40 కిలోల ఇత‌ర సాంప్రదాయ పుష్పాలతో పూజలు నిర్వహించనున్నారు. సహిత కోటి మల్లెపుష్ప మ‌హాయాగంలో మొత్తం 180 మంది ఆంధ్రా, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రముఖ ఋత్వికులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ శ్రీ‌వేంక‌టేవ్వర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

భ‌క్తులు త‌మ ఇళ్ల నుండి టీవీల ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనాల‌నుకునే గృహ‌స్తులకు వర్చువ‌ల్ సేవా టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1001 చెల్లించి ఆన్‌లైన్‌లో ద్వారా ఈ టికెట్లను పొంద‌వ‌చ్చు. వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనే గృహ‌స్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారిని రూ.100 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. దర్శనానంత‌రం గృహ‌స్తుల‌కు ఒక ఉత్తరీయం, ఒక ర‌వికె, అమ్మవారి అక్షింత‌లు అంద‌జేస్తారు.

Also Read: పొంచి ఉన్న కరోనా థర్డ్‌వేవ్.. వాహకాలుగా మారుతున్న టీ స్టాల్స్, ఏటీఎంలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే