Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి పౌర్ణమి గరుడ సేవ రద్దు.. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం

శ్రీ‌వారి వార్షిక జ్యేష్టాభిషేకంలో చివరి రోజు వేడుకల సందర్భంగా పౌర్ణ‌మి రోజున జరగాల్సిన గరుడసేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించమని విజ్ఞప్తి చేశారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి పౌర్ణమి గరుడ సేవ రద్దు.. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం
Tirumala
Follow us

|

Updated on: Jun 14, 2022 | 6:21 AM

Tirumala: తిరుమల శ్రీవారి ఆల‌యంలో నేడు జరగాల్సిన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే శ్రీ‌వారి వార్షిక జ్యేష్టాభిషేకంలో చివరి రోజు వేడుకల సందర్భంగా పౌర్ణ‌మి రోజున జరగాల్సిన గరుడసేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించమని విజ్ఞప్తి చేశారు.

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు సోమ‌వారంనాడు శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేశారు.  ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా నిర్వహించారు.

సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయల మీద స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించాడు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

ఇవి కూడా చదవండి

కాగా నిన్న తిరుమలలోని శ్రీవారిని 93,400 మంది భక్తులు దర్శించుకున్నారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం  రూ. 3.75 కోట్లు రాగా..  39,451 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 6 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..