Vellore Golden Temple : శ్రీ చక్ర ఆకారంలో శ్రీపురంలోని శ్రీ మహాలక్ష్మీదేవి గోల్డెన్ టెంపుల్.. ఎలా వెళ్లాలంటే..!

బంగారు దేవాలయం అంటే ఒకప్పుడు అమృతసర్ లోని గురుద్వారా.. అయితే ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు, బంగరం వాటిపై శిల్పకళ బంగారం,...

Vellore Golden Temple : శ్రీ చక్ర ఆకారంలో శ్రీపురంలోని శ్రీ మహాలక్ష్మీదేవి గోల్డెన్ టెంపుల్.. ఎలా వెళ్లాలంటే..!
Follow us

|

Updated on: Mar 03, 2021 | 6:10 PM

Vellore Golden Temple : తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ కొన్నివేల క్రితంలో నిర్మించిన ఆలయాలే కాదు. కొన్ని ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. ఆలాంటి ఆలయాలలో ఒకటి శ్రీపురం లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. బంగారు దేవాలయం అంటే అంతకు ముందువరకూ అమృతసర్ లోని గురుద్వారా.. అయితే ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు, బంగరం వాటిపై శిల్పకళ బంగారం,గోపురం,విమానం,అర్ధమంటపం, శటగోపం అన్నీ బంగారంతో చేసినవే మరి బంగారం ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

శ్రీపురం స్వర్ణ దేవాలయం వెల్లూర్ లో మలైకోడి ప్రదేశంలో..  శ్రీనారాయణి అమ్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల,బయట రెండు వైపులా బంగారం పూత తో మహాలక్ష్మి గుడి ఉంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో తయారు చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలు ఉన్నాయి,మరియు చేతితో రాసిన శాసనాలు ఎంతో ఘనంగా అలంకరించబడ్డాయి.ఈ ఆలయంలో శాసనాలు, కళ వేదాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

శ్రీపురం స్వర్ణ దేవాలయం కట్టడం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరో తెలుసా?

నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్‌. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్‌ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్‌. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం… ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తిఅమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.

శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయపరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కంటే చాలా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు తక్కువ. * నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకతను పాటించారు. రిజర్వ్‌బ్యాంకు అనుమతి పొంది మినరల్స్‌ అండ్‌ మెటల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ బంగారాన్ని కొనుగోలు చేశారు. * కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది. * 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. * ఆలయానికి రాజగోపురం ఉంది. తిరుమల ఆలయానికి మల్లే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్‌ పూర్తిగా బంగారంతో చేసిందే. * ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు. * ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. * ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు. * ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. * సందర్శకులు తప్పనిసరిగా దుస్తుల కోడ్ ను పాటించాలి * ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి, వెలుపలికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి. దర్శన వేళలు : ప్రతిరోజూ ఉదయం 5.00 గంటల నుంచి 7.30 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, అలంకారం, హారతి ఉంటాయి. ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఎలా వెళ్లాలంటే : తమిళనాడు లోని వేలూరు నుంచి దక్షిణాన వూసూర్‌ ఆనైకట్లు వెళ్లే మార్గంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీపురం నెలకొంది. చిత్తూరు నుంచి 49 కి.మీ.దూరంలో తిరుపతి నుంచి 134 కి.మీ.దూరంలో ఉన్న శ్రీ పురానికి చేరుకోవాలంటే కాట్పాడి రైల్వేస్టేషన్‌లో దిగి చేరుకోవచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి 145 కి.మీ. దూరంలో ఈ క్షేత్రముంది. తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని సందర్శించుకోవచ్చు.

Also Read:

దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు వాటి.. విశిష్టత

చుండ్రు, దురదతో బాధపడుతున్నారా..సమస్యని నివారించే ఇంటి చిట్కాలను తెలుసుకుందాం..!