Tirumala: హనుమంతుడి వాహనంపై రామయ్యగా మలయప్ప స్వామి దర్శనం..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు నేడు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున శ్రీ మలయప్ప స్వామి కోదండ రాముని అలంకారంలో తన భక్తుడైన హనుమంతుడి వాహనంపై కొలువుదీరాడు. వాహనం ముందు వివిధ రాష్ట్రాలకు చెందినకళాకారులు స్వామివారిని కీరిస్తుండగా.. భక్తులకు దర్శనం ఇచ్చాడు.
Updated on: Sep 29, 2025 | 3:29 PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

హనుమంతుడి వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.

గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.

ఈ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.




