పిడుగులు, ఈదురుగాలులతో ఏపీలో వర్షాలు.. ఆ జిల్లాలకు కుండబోతే.! హెచ్చరికలు జారీ..
Rain Alert in Telugu States: దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైఉంది. దీనికి తోడు అల్పపీడనం ఉన్న ప్రాంతంలోనే 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
Updated on: Sep 06, 2023 | 8:59 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైఉంది. దీనికి తోడు అల్పపీడనం ఉన్న ప్రాంతంలోనే 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో అల్పపీడనానికి అనుబంధంగా రుతుపవన ద్రోణి బలపడింది.

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ రోజు కోస్తా రాయలసీమలో మోస్తరు నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

రాయలసీమలోని నంద్యాల, వైయస్సార్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. నాలుగు రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేసింది.

గడచిన 48 గంటలు.. వాన దేవుడు విరుచుకుపడ్డ ఘడియలు. భారీవర్షంతో తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణాలో జనం అల్లాడిపోయారు. ఎస్.. వరుణుడు విలయ తాండవమే ఆడాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో తల్లడిల్లింది భాగ్యనగరం. మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, రామంతాపూర్, బోడుప్పల్.. ఘట్కేసర్.. ఇలా... నార్త్, సౌత్, ఈస్ట్ వెస్ట్.. హైదరాబాద్ అన్ని దిక్కులా ఎటుచూసినా నీళ్లే.

మియాపూర్లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 13 సెంటీమీటర్లు వాన పడింది. గాజుల రామారం, బోరబండ, జీడిమెట్ల, షాపూర్, మూసాపేటల్లో లో 12 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. భాగ్యనగరంలోని అనేక బస్తీలు నీటమునిగాయి, ఇళ్లలోకి నీరు చేరింది. ముంచుకొచ్చిన మాయదారి వాన.. జనజీవితాల్ని ఎంత ఛిద్రం చేసిందో.

గాజుల రామారంలో కాలనీలు నదుల్ని తలపిస్తున్నాయి. చెరువు అలుగు పారి ఇళ్లల్లోకి నీరు చేరింది. శివార్లలోని కొన్ని కాలేజీల్లో హాస్టళ్లకు సెలవులు ప్రకటించారు.. విద్యార్థుల్ని తరలించడానికి మార్గం మాత్రం లేదు... ఎటు చూసినా నీళ్లే... అందుకే ట్రాక్టర్లే పడవలయ్యాయి. ఇండస్ట్రియల్ ఏరియాల్లో వర్షం పడితే మరీ ప్రమాదం. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని కెమికల్ వేస్ట్ నుంచి నురగ విడుదలై వీధుల్లోకి చేరింది. ఇళ్లను ముంచేసింది. దీన్ని గనక పీలిస్తే పైకి పోవడమే.

తెలంగాణాలో జిల్లాల వారీగా వర్షపాతాలు ఎలా నమోదయ్యాయో చూద్దాం. అత్యధికంగా మల్కాజ్గిరిలో 9.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 8.2 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 సెం.మీ, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్లో 5.9 సెం.మీ, సిద్దిపేటలో 5.6 సెం.మీ, హైదరాబాద్ జిల్లాలో 6.8 సెం.మీ. వర్షం పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో డ్యాములన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఇన్ఫ్లో పెరగడంతో నీళ్లను దిగువకు వదిలేస్తున్నారు. నెల రోజుల కిందట కురిసిన వర్షాలతో జంటజలాశయాలు నిండి.. హుస్సేన్ సాగర్లోకి నీటి ఉధృతి పెరిగి.. నగర జనాన్ని బెంబేలెత్తించాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తలెత్తేలా ఉంది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం.. నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... మిగతా అన్ని జిల్లాలన్నిటికీ ఎల్లో అలర్ట్ జారీ ఐంది. తెలంగాణా వ్యాప్తంగా మరో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి.. ఈ వానగండం ఇంకా ఎన్ని రోజులు..





























