Budget 2023: స్వాగతించే విషయం.. నిర్మలా సీతారామన్ను ప్రశంసించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం..
విమర్శల మధ్య.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో 2023 -24 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ లబ్ధి చేకూర్చుతుందని ప్రకటించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ అని.. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉందంటూ పేర్కొంటున్నాయి. ఈ విమర్శల మధ్య.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. ప్రభుత్వం ప్రకటించిన పన్ను తగ్గింపులు స్వాగతించదగిన చర్య అంటూ అభిప్రాయపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. “నేను తక్కువ పన్ను విధానాన్ని నమ్ముతాను. కావున, ఏదైనా పన్ను తగ్గింపు చర్యలను స్వాగతించవచ్చు.. ఎందుకంటే ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు ఇవ్వడం ఆర్థిక వ్యవస్థను బలపర్చడానికి ఉత్తమమైన మార్గం.’’ అంటూ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని తెలిపారు.
అనంతరం, బడ్జెట్పై మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ.. దేశంలోని సాధారణ ప్రజల కష్టాలతో సహా తీవ్రమైన ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించడం లేదని, ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. “దేశ ఆర్థిక పరిస్థితి, సామాన్యుల దుస్థితికి సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా లేదు.” అని అభిప్రాయపడ్డారు.
I am a believer in a low tax regime. So, any tax cuts are welcome because giving more money into the hands of the people is the best way to boost the economy: Karti Chidambaram, Congress MP pic.twitter.com/0Ea0vQGonb
— ANI (@ANI) February 1, 2023
దేశంలో ప్రజలు తీవ్ర దుస్థితిలో ఉన్నారన్నారు. ‘‘ధరల పెరుగుదల, నిరుద్యోగంతో సహా ప్రస్తుత ఆర్థిక సమస్యలను బడ్జెట్లో పరిష్కరిస్తున్నారా లేదా అన్నదే అసలు సమస్య, ప్రజలకు ఆదాయం లేదు, పన్ను పరిమితి పెంచడం ద్వారా వారు ఎలా ప్రయోజనం పొందగలరు? ” అని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..