మూడు ముక్కలైన పాము.. అయినా యువతిని వదలకుండా కాటు వేయడంతో..
పాము ముక్కలైన తలలో మాత్రం విషం అలాగే ఉండి.. కాటు వేస్తే ప్రాణాలు పోతాయనేదానికి ఈ ఘటనే నిదర్శనం. గడ్డి కత్తిరిస్తున్నప్పుడు మిషన్లో పడి పాము మూడు ముక్కలు అయ్యింది. అయినా పాము తల భాగం యువతిని కాటేసింది. వెంటనే ఆమె ఆరోగ్యం క్షీణించగా.. కుటుంబ సభ్యులు నాటు వైద్యం చేయించాయి. కానీ చివరకు ఏం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సబల్గఢ్ ప్రాంతం నౌదండ గ్రామంలో పాము కాటుకు యువతి మరణించింది. అయితే పాము సాధారణంగా కాటు వేయలేదు. పాము అప్పటికే మూడు ముక్కలైనా.. యువతిని వదలకుండా తల భాగం యువతిని కాటేయడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారతి అనే 18 ఏళ్ల యువతి తన ఇంట్లో పశువుల కోసం గడ్డిని మిషన్తో కత్తిరిస్తోంది. ఆ గడ్డిలో దాక్కున్న పామును ఆమె చూడలేదు. దాంతో గడ్డి కోసే యంత్రంలో చిక్కుకుని ఆ పాము మూడు ముక్కలైంది. అయితే ఆ సమయంలో ముక్కలైన పాము తల భాగం ఇంకా ప్రాణంతో ఉండి ఆమె చేతిని కాటు వేసింది.
నాటు వైద్యంతో ప్రాణమే పోయింది
పాము కాటు వేయగానే అమ్మాయికి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, ముందుగా గ్రామాల్లో ఉండే నాటు వైద్యం చేయించారు. తర్వాత వేరే రెండు గ్రామాలకు కూడా తీసుకెళ్లారు, కానీ లాభం లేకపోయింది. చివరికి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో సబల్గఢ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. పాము కాటుతో అమ్మాయి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సబల్గఢ్ ప్రాంతంలో గత కొన్ని వారాలుగా పొలాలు, ఇళ్ల సమీపంలో పాములు కనిపించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ పెరగడం, పొలాల్లో మేత పుష్కలంగా పెరగడం వంటి కారణాల వల్ల పాములు ఆహారం కోసం బహిరంగ ప్రదేశాల్లోకి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశుగ్రాసం లేదా పొలాల్లో పనిచేసేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




