Stray Dogs case: వీధికుక్కలపై సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు
ఇకపై బౌబౌలు వినపడవ్...! కరవడాలూ కనపడవ్...! మై డియర్ డాగ్స్... ఇట్స్ టైమ్ టు వెకేట్ అంటూ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో యాక్షన్ షురూ అయ్యింది. రోడ్డెక్కిన డాగ్ వెహికిల్స్... రోడ్లపై కుక్కులు కనపడకుండా చేస్తున్నాయ్. 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్న సుప్రీం ఆర్డర్స్తో ఇటు అధికారులూ వెరీ స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్న కుక్కలను షెల్టర్ హోమ్స్కు తరలించడం సాధ్యమేనా...?

దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాంగణాల్లో కుక్కకాటు ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ… ఆయా ప్రాంతాలను వీధికుక్కల రహితంగా మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని…ఆ డ్రైవ్పై 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధికుక్కలను పట్టుకున్న ప్రాంతాల్లో తిరిగి వదలొద్దని… సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సుప్రీం నుంచి కీలక ఆదేశాలందాయ్.
ఈ ఏడాది ఆగస్టు 11న, జస్టిస్ పార్దివాలా, ఆర్. మహదేవన్తో కూడిన ధర్మాసనం కుక్కల దాడులను సీరియస్గా తీసుకుంది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో ఉన్న వీధికుక్కలను షెల్టర్ హోమ్లకే పరిమితం చేయాలని ఆదేశించింది. అయితే జంతు ప్రేమికులు కోర్టు తీర్పును నిరసిస్తూ… విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. సంస్థాగత ప్రాంతాల్లో కుక్కకాటు కేసులు పెరిగిపోతుండటాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు సమన్వయంతో ఒక జాయింట్ డ్రైవ్ నిర్వహించి, అన్ని ప్రాంతాల్లోని వీధికుక్కలను పట్టుకోవాలని స్పష్టం చేసింది.
అదేవిధంగా… జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే చర్యలు చేపట్టి, రోడ్లపై ఉన్న పశువులను పట్టుకుని, వాటిని షెల్టర్ హోమ్లకు తరలించాలని ఆదేశించింది. వాటికి అవసరమైన సంరక్షణ, వసతులు కల్పించాలని సూచించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు NHAI కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
కుక్కకాటుతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దిగజారుతోందని సుప్రీం అభిప్రాయపడింది. ఇప్పటి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ డ్రైవ్ను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని… 8 వారాల్లో కుక్కలన్నింటిని షెల్టర్ హోమ్స్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సో… అసలు వీధికుక్కలే లేకుండా చేయాలన్న ఈ స్పెషల్ డ్రైవ్ ఏమేర సక్సెస్ అవుతుందన్నది చూడాలి…!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
