Government Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. వార్మర్ అధిక వేడితో నవజాత శిశువుకు నూరేళ్లు నిండిపోయాయి..
చిన్నారి మంగళవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. అధిక వేడి కారణంగా మరణించిందని.. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రాణం పోసే దేవాలయం ఆసుపత్రి అని ఎంతో నమ్మకంతో వైద్యం చేయించుకోవడానికి ఎందరో వస్తారు. అటువంటి హాస్పటల్ లో కొందరి నిర్లక్ష్యంతో నిండు నూరేళ్లు జీవించాల్సిన పసికందు ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అధిక వేడిని తట్టుకోలేని ఓ నవజాత శిశువు మరణించింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)లో వార్మర్ వేడెక్కడం వల్ల నవజాత శిశువు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లీబిడ్డల విభాగంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో పాప కూడా గాయపడింది.
ఈ ఘటనపై ఆసుపత్రి అధికారి స్పందిస్తూ.. ఎన్ఐసియులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేశామని చెప్పారు. అంతేకాదు ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మృతి చెందిన పాప వయసు 21 రోజులు. బరువు తక్కువగా ఉన్న శిశువుని అక్టోబర్ 5న NICUలో చేర్చారు. చిన్నారి మంగళవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. అధిక వేడి కారణంగా మరణించిందని.. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..