Presidential Elections 2022: విపక్షాలకు షాక్.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ షాకింగ్ నిర్ణయం

ఐక్య విపక్ష అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను బరిలో నిలిపే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా బలపరిచారు. ఈ విషయంలో తృణముల్ కాంగ్రెస్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

Presidential Elections 2022: విపక్షాలకు షాక్.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ షాకింగ్ నిర్ణయం
NCP Chief Sharad Pawar (File Photo)
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2022 | 4:44 PM

India Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో హస్తిన రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. బీజేపీ మద్ధతుతో బరిలో నిలిచే రాష్ట్రపతి అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. విపక్షాల తరఫున బలమైన ఐక్య అభ్యర్థిని నిలిపేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. అటు రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఎవరు ఉండొచ్చన్న అంశంపై ఇప్పటికే చర్చ మొదలయ్యింది. విపక్షాల తరఫున ఐక్య అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ఇటు కాంగ్రెస్ పెద్దలు.. అటు తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలపై మమతా బెనర్జీ విపక్ష నేతలతో ఢిల్లీలో బుధవారం (జూన్ 15న) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో సహా 22 పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.

ఈ నేపథ్యంలో ఐక్య విపక్ష అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను బరిలో నిలిపే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా బలపరిచారు. ఈ విషయంలో తృణముల్ కాంగ్రెస్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, తృణముల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలవడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో పవార్ ఉండబోరని ఎన్సీపీ స్పష్టంచేసింది. శరద్ పవార్ అధ్యక్షతన సోమవారం జరిగిన మహారాష్ట్ర ఎన్సీపీ మంత్రుల సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. శరద్ పవార్‌ను విపక్షాల తరఫు రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపితే.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని విపక్ష నేతలు భావిస్తున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు విపక్షాలకు లేనందున.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని శరద్ పవార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల మధ్య సఖ్యత ఎండమావిగానే మారింది. దీంతో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. జాతీయ రాజకీయాల్లో తనకు తిరుగులేదని కమలం పార్టీ చాటింది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల మధ్య సఖ్యత సాధ్యంకాకపోవచ్చంటున్న బీజేపీ నేతలు.. తమ పార్టీ మద్ధతుతో బరిలో నిలిచే అభ్యర్థి రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.50 శాతానికి పైగా ఎలక్టోరల్ ఓట్లు ఎన్డీయే కూటమి పక్షాలకు ఉన్నందున.. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. జులై 24తో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి.