వ్యవసాయ శాఖ మంత్రి రైతుల ఫోన్ కాల్ కి అందుబాటులోనే ఉన్నారు, అఖిలపక్ష భేటీలో మోదీ
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదన ఇంకా అలాగే ఉందని ప్రధాని మోదీ చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదన ఇంకా అలాగే ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అన్నదాతల ఫోన్ కాల్ కి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందుబాటులోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఈ నెలారంభంలో వారికి ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు ఆయన చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ప్రభుత్వ లెజిస్లేటివ్ అజెండాను ఆయన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివరించారు. వివిధ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చునన్నారు. ఇందుకు చర్చలే శరణ్యమన్నారు. రైతు చట్టాల అంశానికి సంబంధించిన ప్రతిపాదన మారలేదని, మీ సహచరులకు ఇదే విషయాన్ని వివరించాలని మోదీ సూచించారు. మనం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయామని, కానీ ప్రభుత్వ ప్రతిపాదనలను మీ ముందు ఉంచామని, వీటిపై మీరే చర్చించుకోవాలని తోమర్ రైతులకు తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. మీరు దేశం గురించి మొదట యోచించండి అని అన్నారు. అన్నదాతల ప్రతిపాదనలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిధ్ధంగా ఉన్న విషయాన్నీ తోమర్ పలుమార్లు వారి దృష్టికి తెచ్చినట్టు ప్రధాని వెల్లడించారు.
ఈ నెల 26 న జరిగిన ఢిల్లీ అల్లర్ల గురించి ప్రస్తావించిన మోదీ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. దీనిపై ఊహాగానాలు, చర్చలు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా రైతుల సమస్యలపై ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందన్నారు. ఈ అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ, శివసేన ఎంపీ వినాయక్ రౌత్, శిరోమణి అకాలీదళ్ నుంచి బల్వీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read More :కేరళలో ఆగని కరోనా కలకలం.. 24 గంటల్లో 3,757 పాజిటివ్ కేసులు
Read More:వినియోగదారులకు గూగుల్ పే షాకింగ్ న్యూస్.. నిలిచిపోనున్న వెబ్ యాప్ సేవలు.. అంతేకాదు..!