ఆ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.50.. కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం అంటున్న రైల్వే అధికారులు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇక కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇక కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో జనాల రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ అధికారులు ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచేశారు. ముంబాయి మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధఱను రూ.10 నుంచి ఏకంగా రూ.50 వరకు పెంచుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జనం అధిక రద్దీని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబాయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, లోక్మాన్ తిలక్ టెర్మినల్తో పాటు పొరుగున ఉన్న ఠానే, కల్యాణ్,పాన్వెల్, భీవాండీ రోడ్ రైల్వే స్టేషన్లో పెంచిన ఈ ధరలు అమలు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ పేర్కొన్నారు.
పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు మార్చి 1 నుంచి జూన్ 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. వేసవి ప్రయాణాల సందర్భంగా ఆయా స్టేషన్ల వద్ద అధిక రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముంబాయి మహానగరంలో ఇప్పటి వరకు 3.25 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,400 మంది మృతి చెందారు. అయితే దేశంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్రం. అక్కడి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ప్రతి రోజు 8వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముంబైలో కరోనా నిబంధనలు మరింత కఠితరం చేశారు అధికారులు. మాస్క్లు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,24,527 (1.11కోట్లు) కు చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,57,248 కు చేరింది. అలాగే దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 1,07,98,921 మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,68,358 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.07 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,59,283 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 1వ తేదీ వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.
కాగా, మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరికి మాస్కు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మాస్కులేని వారికి జరిమనా విధిస్తున్నారు. కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గురువావరం ఒక్క రోజులోనే ముంబై నగరంలో జరిమానాల రూపంలో రూ.29 లక్షల వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని రూ.14వేలకుపైగా మంది నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తున్నారు. ఇక 2020 ఏడాది మొత్తం మీద మాస్క్ ధరించని వారి నుంచి ఏకంగా రూ. 30 కోట్ల 50 లక్షలకుపైగా వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది. ఇలా మహారాష్ట్రలో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుండటంతో అధికారులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ప్రతి ఒక్కరికి మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల్లో లాక్డౌన్ విధించే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని, లేకపోతే మున్ముందు మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.