AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet: దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు.. రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్. కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు తీపి కబురు అందించారు. అలాగే దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల విషయంలోనూ

Modi Cabinet: దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు.. రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్. కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు
PM Narendra Modi
Venkata Narayana
|

Updated on: Oct 07, 2021 | 6:56 AM

Share

Central Cabinet Meeting Highlights: కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు తీపి కబురు అందించారు. అలాగే దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల విషయంలోనూ ముందడుగు వేసింది కేంద్రం. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగుల విషయంలో కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. ఈ నిర్ణయం వల్ల 11 లక్షల 56 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై 1985 కోట్ల మేర భారం పడనుంది.

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాత్రి జరిగిన కేబినెట్‌ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు బోనస్‌‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్ పార్కుల ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 వేల 445 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగాను.. 14 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర పార్కులను అభివృద్ధి చేయనున్నాయి. ఇప్పటికే 10 రాష్ట్రాలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. కేంద్ర కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌తో పాటు అనురాగ్‌ ఠాకూర్‌లు మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్‌టైల్‌ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ / బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు టెక్స్‌టైల్‌ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్‌ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది.

ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్‌ ఫండ్‌ సైతం కేంద్రం అందజేయనుంది. టెక్స్‌టైల్‌ పార్కులో వర్కర్స్‌ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్‌ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృద్ధికి 10 శాతం భూమిని వినియోగిస్తారు.

ఇక, రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్‌–గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైల్వే ఉద్యోగుల్లో అర్హులకు బోనస్‌ కింద గరిష్టంగా రూ.17,951 లభించనుంది.

Read also: Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంలో నేడు షాకింగ్ పరిణామాలు, ముఠా బాగోతం..

Follow Us