Karnataka CM: లింగాయత్ సామాజిక వర్గానికే మరో అవకాశం.. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై..!

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో మొదటి నుంచి బసవరాజ్ బొమ్మై పేరు ప్రముఖంగా వినిపించింది. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బసవరాజ్‌కే సీఎం పదవి దక్కింది.

Karnataka CM: లింగాయత్ సామాజిక వర్గానికే మరో అవకాశం.. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై..!
Karnataka New Chief Minister Baswaraj Bommai
Follow us

|

Updated on: Jul 27, 2021 | 8:44 PM

Karnataka New Chief Minister Baswaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును ఖరారు చేశారు. ఆయన పేరును భారతీయ జనతా పార్టీ కోర్‌ కమిటీ ఖరారు చేసింది. తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి పంపింది. యడియూరప్ప వారసుడిని ఎన్నుకొనేందుకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం బెంగళూరులో కొనసాగింది.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో మొదటి నుంచి బసవరాజ్ బొమ్మై పేరు ప్రముఖంగా వినిపించింది. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బసవరాజ్‌కే సీఎం పదవి దక్కింది. లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా లేక మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అని తర్జనభర్జన పడ్డ బీజేపీ అధిష్ఠానం చివరకు బసవరాజ్ బొమ్మై వైపే మొగ్గుచూపింది. మరోవైపు, కొత్త సీఎం రేసులో రాష్ట్ర గనుల శాఖమంత్రి మురుగేశ్‌ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాట్‌, బసవరాజు బొమ్మై, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, ప్రభుత్వ చీఫ్‌విప్‌ సునీల్‌ కుమార్‌ పేర్లు కూడా ప్రధానంగా వినబడిన విషయం తెలిసిందే.

బసవరాజ్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మై 2008లో బారతీయ జనతా పార్టీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత నమ్మకస్తుడిగా చెబుతారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక బీజేపీలో చాలామంది ఎమ్మెల్యే మద్దతు కూడా బసవరాజ్ బొమ్మైకి ఉండటం కొసమెరుపు.

రాత్రి 7గంటలకు బీజేపీ అధిష్ఠానం పంపించిన ముగ్గురు ప్రతినిధుల బృందం కర్ణాటక ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్,కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,ధర్మేంద్ర ప్రధాన్‌లు ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చలు జరిపారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని… సమర్థత,సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన అసమ్మతి,వయోభారం కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత వారం బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి పెద్దల ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే నాయకుడి కోసం ప్రస్తుతం బీజేపీ అన్వేషిస్తోంది.

Read Also…  Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై.. కాసేపట్లో అధికారికంగా ఖరారు..?