AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. అటు వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానాలన్నీ రద్దు!

మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎయిర్ ఇండియా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాలకు విమాన సేవలను నిలిపివేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండిగో సైతం ప్రయాణ సలహా జారీ చేసింది. ప్రయాణానికి ముందు విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని సంస్థలు సూచించాయి.

విమాన ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. అటు వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానాలన్నీ రద్దు!
Air India
SN Pasha
|

Updated on: Feb 28, 2026 | 9:08 PM

Share

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడింది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ సహా మధ్యప్రాచ్యంలోని పలు గమ్యస్థానాలకు వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది.

ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణంగా ఇజ్రాయిల్‌ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్‌కు ఇరాన్‌ ప్రతిస్పందన ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కొన్ని దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో విమాన సేవలకు ఆటంకం ఏర్పడింది. ఫిబ్రవరి 28న టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI139 మధ్యలోనే భారత్‌కు తిరిగి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. యుఎఈలోని దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియాలోని రియాద్, జెడ్డా, దమ్మామ్, ఖతార్‌లోని దోహా, ఒమన్‌లోని మస్కట్, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మార్గాల్లో సేవలు నిలిపివేశారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యున్నత ప్రాధాన్యత అని సంస్థ స్పష్టం చేసింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొంది.

ఇక ఇండిగో కూడా ప్రయాణ సలహా జారీ చేసింది. ఇరాన్ మరియు గల్ఫ్ ప్రాంత పరిణామాలను తమ బృందం నిశితంగా గమనిస్తోందని, భద్రతా పరిస్థితుల ఆధారంగా విమాన కార్యకలాపాల్లో తక్షణ మార్పులు చేస్తామని తెలిపింది. ప్రయాణికులు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచించాయి. మార్పులు జరిగితే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సమాచారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఉద్రిక్తతపై యూరోపియన్ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు దేశాలు తమ పౌరులకు మధ్యప్రాచ్య ప్రయాణాలపై హెచ్చరికలు జారీ చేశాయి. పరిస్థితి మరింత ఎలా మారుతుందన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా నిశితంగా గమనిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us