Isha Yoga Center: ఈషా శ్మశానవాటిక వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు! ఏం చెప్పిందంటే?
కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ గ్యాస్ శ్మశానవాటికపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. శ్మశానవాటిక నిర్మాణానికి వ్యక్తిరేకంగా ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈషా సేవను 'ధర్మబద్ధమైన పని'గా కొనియాడారు. పిటిషనర్కు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు విషయంలో ఇరు వర్గాలు చర్చించుకొని ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.

పిటిషనర్ తన భూమిలో కొంత భాగాన్ని ఇప్పటికే ఈషాకు అమ్మేశాడని సుప్రీం కోర్టు గుర్తించింది. పిటిషనర్ పక్కనే ఉన్న భూమి విషయంలో ఇరు వర్గాలు చర్చించి సామరస్యపూర్వక పరిష్కారం చేసుకోవాలని సలహా ఇచ్చింది. కోర్టు సలహాకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని సాఫీగా చర్చల ద్వారా పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మధ్యస్థత్వం కోసం రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు జడ్జి రాజేంద్రన్ను మధ్యవర్తిగా నియమించాలని కోర్టు ఆదేశించింది.
ఇషా యోగా సెంటర్లో నిర్మించిన ఆధునిక గ్యాస్ క్రిమేటోరియంపై దాఖలైన కేసును మద్రాస్ హైకోర్టు గతంలో కొట్టివేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ వద్ద ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు గ్యాసిఫైయర్ క్రిమేటోరియం సరైన పంచాయతీ అనుమతితో, నిబంధనల ప్రకారం నిర్మించబడిందని కోర్టు పేర్కొంది. అలాగే క్రిమేటోరియం నిర్మాణం, ముఖ్యంగా గ్యాస్ క్రిమేటోరియం సమాజానికి సేవ చేస్తుంది.. దీనిని ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా చెప్పలేము అని పేర్కొంది.
ఇషా యోగా సెంటర్ చుట్టూ ఉన్న ఐదు గ్రామ పంచాయతీలకు పైగా ఉన్న ప్రజలు తమ ప్రాంతంలో క్రిమేటోరియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. దీని ఫలితంగా, ఇషా ఫౌండేషన్ పంచాయతీ అనుమతితో, తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు, మార్గదర్శకాల ప్రకారం ఆధునిక గ్యాసిఫైయర్ క్రిమేటోరియం ఏర్పాటు చేసింది. 2010 నుంచి ఇషా ఫౌండేషన్ తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో క్రిమేటోరియంలను నిర్వహిస్తోంది. “మరణంలో గౌరవం” అనే ఉదాత్త లక్ష్యంతో ఇది చేస్తోంది.
ప్రస్తుతం చెన్నై బెసంట్ నగర్, కోయంబత్తూర్, నెయ్వేలి, వెల్లూర్, తంజావూర్ తదితర ప్రాంతాల్లో 30 క్రిమేటోరియంలను ఇషా నిర్వహిస్తోంది. ఈ క్రిమేటోరియంలలో ఇషా సుందరమైన పార్కులా శాంతియుత ఆకుపచ్చ పరిసరాలు సృష్టిస్తూ, చెట్లు నాటి పెంచుతోంది. సరైన రహదారులు, స్నానం, టాయిలెట్ సౌకర్యాలు శుభ్రంగా నిర్వహిస్తోంది. పర్యావరణ దెబ్బతినకుండా ప్రభుత్వ సహాయంతో అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
అంతేకాకుండా, గత డిసెంబర్లో ఇషా ఫౌండేషన్ తమిళనాడు ప్రభుత్వంతో కలిసి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత క్రిమేషన్ సేవలు అందించే పథకాన్ని ప్రకటించింది. ఇది ఆర్థికంగా వెనుకబడిన వారు తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలను గౌరవప్రదంగా, ఆర్థిక భారం లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
